ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థిని బలి | student burnt alive in Eluru town | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థిని బలి

Mar 5 2016 8:17 PM | Updated on Nov 9 2018 5:02 PM

ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థిని బలి - Sakshi

ప్రేమోన్మాది ఘాతుకానికి విద్యార్థిని బలి

ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన ఇందుమతి (18) అనే యువతిపై విక్కీ అనే యువకుడు, అతడి సోదరుడు పెదబాబు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో.. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మరణించింది.

ప్రేమోన్మాది వేధింపులు మరో యువతి ప్రాణాలు బలిగొన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన ఇందుమతి (18) అనే యువతిపై విక్కీ అనే యువకుడు, అతడి సోదరుడు పెదబాబు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో.. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ఆమె శనివారం రాత్రి మరణించింది. అంతకుముందు జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ స్వయంగా ఆస్పత్రికి వచ్చి ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విక్కీ అనే యువకుడు, అతడి సోదరుడు పెదబాబు తమ ఇంటికి ఎవరూ లేని సమయంలో మధ్యాహ్నం వచ్చి.. తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని ఆమె చెప్పింది. ఇందుమతిని విక్కీ రెండేళ్లుగా వేధిస్తున్నాడు. దాంతో మధ్యలో కొన్నాళ్లు చదువు కూడా ఆపేసింది.

తర్వాత ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఇటీవల కొన్నాళ్లుగా అతడు వెంబడిస్తున్నాడు. ఈమధ్యే పదిమంది యువకులతో కలిసి వచ్చి అమ్మాయి తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. దాంతో వాళ్లు ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విక్కీ తరఫు పెద్దలను పిలిచి హెచ్చరికలు జారీ చేశారు. కేసు కూడా నమోదు చేశారు. శనివారం సాయంత్రం రెండువైపులా పెద్దలను పిలిపించి మాట్లాడాలని అనుకున్నారు. కానీ ఈలోపే మధ్యాహ్నం చాటపర్రులోని వాళ్ల ఇంటికి వెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించారు. దాంతో 90 శాతం కాలిన గాయాలైన ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి ఆమె మరణించింది. నిందితులు ఇద్దరిపైనా నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement