సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వాసితుల పునరావాసంపై టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా
శ్రీకాకుళం అర్బన్: సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిర్వాసితుల పునరావాసంపై టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శనివారం ఒకప్రకటనలో తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట ఫలితంగా పునరావాసంలో అనేక మార్పులు వచ్చినా వాటిని సక్రమంగా అమలు జరపడం లేదని పేర్కొన్నారు.
18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు, వికలాంగులు, భర్త విడిచిపెట్టినవారు, వితంతువులకు ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని జీవో 68లో సవరణ 2007లో వచ్చినా ఒక్క ప్రాజెక్టులోనూ అమలు జరపలేదని తెలిపారు. ఎఫ్ఆర్ఎల్ పాయింట్ నుంచి 100 మీటర్లు దూరం వరకు ఉన్న గ్రామాలూ ముంపు గ్రామాలుగానే సవరణలు వచ్చినా చాలా ప్రాజెక్టుల్లో అమలు చేయడం లేదని ఆవేదన చెందారు.
ప్రభుత్వ లెక్క ప్రకారం యువతీ యువకులను మినహాయించి వంశధార నిర్వాసిత కుటుంబాలు ఏడు వేలు, యువతీ, యువకులకు కలుపుకుంటే 11 వేలు కుటుంబాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే వీరిలో ఇప్పటివరకు సుమారు 3 వేలు మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని తెలిపారు. వంశధార ప్రాజెక్టులో ఒక్క యువతీ యువకుడికీ ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.