కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేయాలి | Sakshi
Sakshi News home page

కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేయాలి

Published Sun, Oct 9 2016 12:00 AM

కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తి చేయాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ
  •  
    న్యూశాయంపేట : జిల్లాల కార్యాలయాల ప్రారంభ ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. జిల్లాల విభజన, నూతన జిల్లాల ఏర్పాటు, జిల్లాల ప్రారంభోత్సవాల గురించి శనివారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈనెల 11న ఉదయం 10.30గంటలకు నూతన జిల్లాల కార్యాలయాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ, జాతీయ గీతాలాపనతో కేటాయించిన మంత్రులతో జిల్లా ప్రారంభోత్సవం చేసిన తర్వాత భవన సముదాయ ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.
     
    నూతన జిల్లాల ప్రారంభోత్సవాలు ఘనంగా నిర్వహించి, జిల్లా కలెక్టర్లు నూతన ఫైళ్లను కూడా పరిశీలించి ఆమోదించే ఏర్పాట్లు చేయాలన్నారు. సాయంత్రం నూతన జిల్లా కేంద్రాల్లో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. 10న ఆయా జిల్లా కేంద్రాల్లో పనిచేసే అధికారులకు సిబ్బంది ఆర్డర్‌ టూ సర్వ్‌ ఉత్తర్వులు జారీ ఉంటుందని, వెంటనే విధులకు హాజరై కార్యాలయ బాధ్యతలు స్వీకరించి అదేరోజు పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్‌ వాకాటి కరుణ మాట్లాడుతూ ప్రతిపాదిత మూడు జిల్లాలతోపాటు జనగామ జిల్లాలోని కార్యాలయాల్లో అవసరమైన భవనాలను సిద్ధం చేసి ఫర్నిచర్‌, ఇతర సామగ్రి ఏర్పాటు చేసినట్లు వివరించారు. నూతనంగా ప్రకటించిన జనగామ జిల్లాకు నిధులు విడుదల చేయాలని కోరారు. జేసీ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్, డీఆర్‌ఓ కె.శోభ, జిల్లా పరిషత్‌ సీఈఓ విజయగోపాల్, సీపీఓ రామచంద్రరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement