లక్నో: ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినప్పుడు అధికారుల కుర్చీలపై తళతళలాడే తెల్లటి టవల్స్ను ఎప్పుడైనా గమనించారా? ఇవి కేవలం పరిశుభ్రతకు మాత్రమే కాదు, ప్రభుత్వ వ్యవహారాల్లో ‘అధికారానికి నిదర్శనం’గా కూడా మారాయి. ఇంటర్నెట్లో నెటిజన్లను తీవ్రంగా ఆశ్చర్యపరుస్తున్న ఈ ‘తెల్ల టవల్’ సంస్కృతి వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన, వాస్తవిక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
అధికారానికి కేరాఫ్ అడ్రస్
ప్రభుత్వ ఆఫీసుల్లో తెల్ల టవల్స్ను కేవలం ఒక వస్త్రంగా కాకుండా, ఒక అధికారిక చిహ్నంగా భావిస్తారు. కేతన్ అనే ఒక నెటిజన్ పెట్టిన ట్వీట్తో ఆన్లైన్లో ఈ చర్చ మొదలైంది. ఉన్నతాధికారులు తెల్లని టవల్స్ వేసిన కుర్చీలలో కూర్చుని దర్పాన్ని ప్రదర్శిస్తుంటే, చట్టసభలకు ఎన్నికైన తమకు అలాంటి ఆ గౌరవం దక్కలేదని ఉత్తరప్రదేశ్కు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు గతంలో ఫిర్యాదు చేసినట్లు ఆ నెటిజన్ తన పోస్ట్లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
టవల్స్ కోసం అత్యవసర సమావేశం
ఈ టవల్స్ వ్యవహారం ఎంత తీవ్ర స్థాయికి వెళ్లిందంటే, 2024లో యూపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ దీనిపై ఏకంగా ఒక అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రొటోకాల్స్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా జరిగే అధికారిక సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం అధికారులతో సమానంగా తెల్లటి టవల్స్ కప్పిన కుర్చీలనే ఖచ్చితంగా కేటాయించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
వారానికి వెయ్యికి పైగా టవల్స్ మార్పు
ఈ తెల్ల టవల్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందో లక్నోలోని ఉత్తరప్రదేశ్ సచివాలయాన్ని చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఏకంగా వారానికి రెండు సార్లు (సోమవారం, గురువారం) కుర్చీలపై ఉన్న దాదాపు 1,000 టవల్స్ను మారుస్తుంటారని సమాచారం. ప్రస్తుత ఆధునిక కాలంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలకు టవల్ వేసే ఆచారం కొనసాగుతుండటం ఉండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇది కూడా చదవండి: ‘ఊపిరి ఉన్నంత వరకు..’ పహల్గామ్ బాధితుల వ్యథ


