చెరువును చెరబట్టారు..! | pond destroy | Sakshi
Sakshi News home page

చెరువును చెరబట్టారు..!

Dec 19 2016 10:53 PM | Updated on Sep 17 2018 8:02 PM

చెరువును చెరబట్టారు..! - Sakshi

చెరువును చెరబట్టారు..!

హాలహర్వి మండలం చింతకుంట చెరువుకు గండ్లు కొట్టించి, నీరు వెళ్లిన తరువాత.. చెరువు భూములను సాగు చేయిస్తున్నారు.

– మీ కోసంలో ఫిర్యాదు
కల్లూరు (రూరల్‌): ‘‘ హాలహర్వి మండలం చింతకుంట చెరువుకు గండ్లు కొట్టించి, నీరు వెళ్లిన తరువాత.. చెరువు భూములను సాగు చేయిస్తున్నారు. 150 ఎకరాల చెరువు భూమిని ఎకరా రూ.5వేలు చొప్పున బేరం పెట్టారు. రైతులు ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారు. చెరువు కింద పంటలు సాగు చేసుకున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మాంది. మామూళ్లకు కక్కుర్తి పడి స్థానిక అధికారులు మమల్ని పట్టించుకోవడం లేదు. దయచేసి చెరువును కాపాడి పంటలకు నీరందించండి’’ అంటూ రైతులు కద్రరిచి ఈశ్వరప్ప, ఈశ్వర్, మల్లికార్జున, ఎర్రిస్వామి, మధుగన్న, హుస్సేన్.. తదితరులు జాయింట్‌ కలెక్టర్‌ 2 రామస్వామికి వినతి పత్రం సమర్పించారు. సోమవారం మీ కోసం ప్రజాదర్బార్‌ కార్యక్రమం సునయన ఆడిటోరియంలో నిర్వహించారు. వివిధ సమస్యలపై వచ్చిన వారి నుంచి కలెక్టర్‌ సిహెచ్‌ విజయ్‌మోహన్, జాయింట్‌ కలెక్టర్‌  హరికిరణ్, జేసీ2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, హౌసింగ్‌ పీడీ హుస్సేన్‌ సాహెబ్‌ వినతులను స్వీకరించారు. వినతుల్లో కొన్ని.. 
 
  •  వెల్దుర్తి మండలం గోవర్ధనగిరి గ్రామ పొలిమేరలోని తన పొలంలో శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మాధవరావు, పెద్ద రంగస్వామి, శివాంజనేయులు, మాధవస్వామిలు దౌర్జన్యంగా ఉపాధి హామీ పథకం కింద రస్తా వేయించారని, న్యాయం చేయాలని ఐ. మద్దిలేటి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
  • వెల్దుర్తి మండలం గోవర్ధన గిరిలోని సర్వే నెంబర్లలో 134, 165లలోని 250 ఎకరాలు 32 మంది దళితులకు ప్రభుత్వం మంజూరు చేసిందని, అయితే ఎవరి భూమి వారికి ఇచ్చేందుకు తహసీల్దార్‌కు సుముఖత వ్యక్తం చేయడం లేదని.. దళితులు బన్న కిష్టన్న, చిన్న కిష్టన్న, ఎరుకలి సుంకన్న, దళిత బాలయ్య, అనుమన్న, నాగశేషులు, గోవిందుతో పాటు 32 మంది దళితులు.. కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
  •  కల్లూరు మండలం పెద్దపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్‌ 79/2/బీలోని ఓపెన్‌ సైట్‌లో నకిలీ పట్టాలు, లేఔట్లను రద్దు చేసి, పూరి సెడిసెల్లో నివాసం ఉంటున్న తమకు ఇప్పించాలని ఎం. సువేదమ్మ, ఎం. సువర్ణమ్మ, షబానా కోరారు. 
  •  ఆశావర్కర్స్‌కు తక్షణమే నెలకు రూ.5వేలు ఇచ్చి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారితోషికాలు పెంచాలని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మలమ్మ, ఏపీ ఆశావర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) నాయకురాళ్లు రమిజాబీ, శివలక్ష్మీ, లక్ష్మీ, ఈశ్వరమ్మ కలెక్టర్‌కు విన్నవించారు. 
  •  ఎస్సీ మేనేజ్‌మెంట్‌ హాస్టళ్లలో వార్డెన్లు లేరని.. మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఏఐఎస్‌ఎఫ్‌ నగర కార్యదర్శి, సహాయ కార్యదర్శి, నగర ఉపాధ్యక్షులు ఎ నాగరాజు, కె వెంకటేష్, కె మధు, విద్యార్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 
  •  హౌసింగ్‌ కార్పొరేషన్‌లో ఇళ్లు మంజూరైతే ఇళ్లు కట్టుకున్నామని.. అయితే ఇళ్లు పూర్తయినా ఒక్క బిల్లు మంజూరు కాలేదని పెద్దపాడుకు చెందిన కురువ శివరాముడు హౌసింగ్‌ పీడీ హుస్సేన్‌ సాహెబ్‌కు ఫిర్యాదు చేశారు. 
  •  ఆదర్శ పాఠశాల, కస్తూరిబాలలో అటెండర్, స్వీపర్‌ ఉద్యోగం ఇప్పించాలని వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కె. మల్లికార్జున జేసీ2కు విన్నవించారు. 

Advertisement
 
Advertisement
Advertisement