పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్లర దొంగల బెడద అధికంగా ఉంది.
పీఎం పాలెం: పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చిల్లర దొంగల బెడద అధికంగా ఉంది. ఆర్నెల్లలో 45 చోరీ కేసులు నమోదయ్యాయంటే ఇక్కడ దొంగతనాల జోరు ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. గొలుసు దొంగతనాలు 5, ఇంటి దోపిడీలు 13, రెండు ద్విచకక్రవాహనాలు, రెండు ల్యాప్ ట్యాప్ కేసులున్నాయి.మిగిలినవి చిన్నచిన్న కేసులు. వీటిలో రెండు చైన్ స్నాచింగ్ , ఒక ఇంటి దొంగతనం కేసులను మాత్రమే పోలీసులు చేధించారు.
వరుస దొంగతనాలతో బెంబేలు
గత వారంలో జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న ఓ టైల్స్ మార్టుషాపు పైకప్పు తొలగించి షాపులోకి ప్రవేశించిన దొంగలు క్యాష్ కౌంటర్లోని రూ. 1.85 లక్షలు దోచుకున్నారు. కారుషెడ్ కూడలి చుట్టు పక్కల ఉన్న చిరు, మధ్యతరహా షాపులతో పాటు ఆలయాల్లో హుండీలను కూడా చోరులు వదలడం లేదు. కూడలి ప్రాంతంలో చిన్నా పెద్దా కలిపి సుమారు 30 వరకు షాపులున్నాయి. వీధి దీపాలు సక్రమంగా వెలగక పోవడాన్ని అవకాశంగా తీసుకుని చిల్లర దొంగలు రాత్రి వేళల్లో తమ హస్త లాఘవం చూపుతున్నారు.
పాన్షాప్లే లక్ష్యంగా..
కిళ్లీ బడ్డీలు, చిన్న చిన్న షాపులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. చేతికి అందిన కాడికి దోచుకుంటున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు› ఇక్కడి స్క్రాప్ కొట్టులో చిల్లర దొంగలు ప్రవేశించి గళ్లా పెట్టెలో ఉన్న రూ. 500 దోచుకు పోయారు. కూడలికి సమీపంలో ఉన్న శివాలయానికి చెందిన హుండీని శుక్రవారం రాత్రి బద్దలు కొట్టి భక్తులు సమర్పించిన నగదు కానుకలు అపహరించుకు పోయారు. కిరాణా షాపు, సెల్ షాపుల కప్పు నుంచి లోపలకు చొరబడి విలువైన వస్తువులు, నగదు దోచుకున్నారు. వరుస చోరీలతో షాపులనిర్వహకులుబెంబేలెత్తి పోతున్నారు.చోరుకుల చెక్ పెట్టాలని కోరుతున్నారు.