'పట్టిసీమను ఆ నిధులతోనే పూర్తిచేశాం' | Pattiseema completes with State funds only, says Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'పట్టిసీమను ఆ నిధులతోనే పూర్తిచేశాం'

Mar 9 2016 6:34 PM | Updated on Aug 21 2018 8:34 PM

పోలవరం కోసం కేంద్రం ఇచ్చే నిధుల్ని పట్టిసీమకు మళ్లించలేదని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

హైదరాబాద్‌: పోలవరం కోసం కేంద్రం ఇచ్చే నిధుల్ని పట్టిసీమకు మళ్లించలేదని.. రాష్ట్రప్రభుత్వ నిధులతోనే పూర్తిచేశామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. నదుల అనుసంధానం వల్ల రాయలసీమకు నీళ్లిచ్చే అవకాశం దక్కిందని అన్నారు. తాను త్వరలో ఢిల్లీ వెళుతున్నాననీ, పోలవరం పనులు కేంద్రం చేస్తామని చెబితే సంతోషంగా వాళ్లకు అప్పగిస్తామన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు రూ.50 కోట్లు చొప్పున కేంద్రం ఇచ్చిందని చెప్పారు. ఇంకా కేంద్రం నుంచి రూ. 13, 500 కోట్లు రెవిన్యూ లోటు భర్తీ జరగాల్సి ఉందని అన్నారు. రాజధాని అమరావతికి పెద్ద ఎత్తునా పెట్టుబడులు రావాలని చెప్పారు.

అలాగే పెట్టుబడుల సమీకరణకు తాను ఇంగ్లండ్‌ వెళుతున్నానని చంద్రబాబు తెలిపారు. రాజధాని మౌలిక సదుపాయల కల్పనకు నిధులు రాబట్టే విషయంలో రకరకాల ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని, ప్రతిపక్ష నేతల్ని చూశాను అని చంద్రబాబు అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు పరిహారం ఇచ్చి భూములు అభివృద్ధి చేసి అందించే బాధ్యత ప్రభుత్వానికి వుందని చెప్పారు. ల్యాండ్‌ పూలింగ్‌ ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. దేశంలో ఇవాళ మనం గ్రోత్ రేటులో అగ్రస్థానంలో వున్నామని చంద్రబాబు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement