బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానం | Organs donated by brain dead person at tirupati | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానం

Jul 31 2016 5:13 PM | Updated on Sep 4 2017 7:13 AM

తిరుపతిలో ఓ వ్యక్తికి బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అతని కుటుంబ సభ్యులు అవయవదానం చేశారు.

తిరుపతి మెడికల్ : అనారోగ్యంతో బాధపడుతూ బ్రెయిన్ డెడ్‌కు గురైన ఓ వ్యక్తి శరీరంలోని అవయవాలను అతని కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు. తిరుపతి గాంధీపురంలో నివాసం ఉండే పెద్దపాపమ్మకు కుమారుడు బి.చిరంజీవి రెడ్డి(45) ఉన్నాడు. అవివాహితుడైన చిరంజీవి తిరుపతిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు పద్ధతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తీవ్రమైన జ్వరంతో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఈనెల 27న స్విమ్స్‌లో చేర్చారు. అత్యవసర విభాగం నుంచి ఆర్‌ఐసియు విభాగంలో వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న చిరంజీవికి శనివారం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో చిరంజీవి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్టు స్విమ్స్ వైద్యులు ధ్రువీకరించారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా అవయవదానానికి ముందుకు వచ్చారు. స్విమ్స్ అధికారులు, జీవన్‌దాన్ ట్రస్ట్ నిర్వాహకులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు దశల వారీగా శస్త్ర చికిత్సలు చేసి నాలుగు అవయవాలను తీసుకున్నారు. అందులో గుండెను హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు విమానం ద్వారా తీసుకెళ్లారు. లివర్‌ను విశాఖపట్నంలోని అపోలో హాస్పిటల్‌కు విమానం ద్వారా తరలించారు. రెండు కిడ్నీల్లో ఒకటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులోని నారాయణ హాస్పిటల్‌కు, మరొకటి తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలోని ఓ రోగికి అమర్చారు.

మరణించినా తన అవయవాలను మరో నలుగురికి దానం చేసిన చిరంజీవి మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి, దాత కుటుంబ సభ్యులకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డెరైక్టర్లు ఆదిక్రిష్ణ, డాక్టర్ వెంకటరామరెడ్డి,అవయవ దాన కోఆర్డినేటర్ ప్రసాద్ రెడ్డి, జయశ్రీ,సుదర్శన్, ప్రకాష్‌లు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement