మా ఊరికి రావొద్దు! | Opposition parties not coming to our town erravalli | Sakshi
Sakshi News home page

మా ఊరికి రావొద్దు!

Aug 3 2016 2:30 AM | Updated on Jul 11 2019 7:45 PM

ఎర్రవల్లిలో ప్రతిపక్షాలు రావద్దంటూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డు - Sakshi

ఎర్రవల్లిలో ప్రతిపక్షాలు రావద్దంటూ ఏర్పాటు చేసిన సూచిక బోర్డు

కాంగ్రెస్.. కమ్యూనిస్టు.. తెలుగుదేశం పార్టోళ్లూ మీ సాయం ఇగచాలు. ఊళ్లేకొచ్చి లేని గొళ్లెం పెట్టకుండ్రి.. మా ఊరికి రావొద్దు.. ఆగం జేయొద్దు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/కొండపాక: ‘కాంగ్రెస్.. కమ్యూనిస్టు.. తెలుగుదేశం పార్టోళ్లూ మీ సాయం ఇగచాలు. ఊళ్లేకొచ్చి లేని గొళ్లెం పెట్టకుండ్రి.. మా ఊరికి రావొద్దు.. ఆగం జేయొద్దు. రాజకీయాలుంటే ఊరి బయటే చేసుకోండ్రి’ అని మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామమైన ఎర్రవల్లివాసులు ప్రతిపక్ష పార్టీలకు నిర్మోహమాటంగా చెబుతున్నారు. వారిని గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. ఈ మేరకు ‘గ్రామంలోకి ప్రతిపక్షాలు రావద్దు’ అని పలకలపై రాసి మంగళవారం ఊరు చుట్టూ బోర్డులు పెట్టారు. ‘2013వ సట్టం ఒప్పుకొమ్మని ఆగమాగం జేస్తిరి. మీ మాటలు ఇని ఆగమైనం. ఇంక మా ఊరికొస్తే మంచిగుండదు.

తపాస్‌పల్లి పోయొచ్చినం.. మీ సక్కదనం జూసొచ్చినం’ అని పేర్కొన్నారు. మల్లన్నసాగర్ ముంపుతో ఇప్పటికే ఆగమైన తమను కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీడీపీలు రెచ్చగొడుతున్నాయని వాపోయారు. 123 జీఓ తమకు నచ్చిందని, మంత్రి హరీశ్ మాటలపై నమ్మకం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతిపక్షాల రాజకీయాల వల్లే కలసి మెలసి ఉంటున్న ఎర్రవల్లిలో గొడవలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లాఠీచార్జిలో గాయపడిన వేములఘాట్ ముంపు గ్రామస్తులను పరామర్శించడానికి సోమవారం కాంగ్రెస్ నాయకులు వెళ్లబోతే తమ ఊరిగుండా వెళ్లొద్దంటూ ఎర్రవల్లి ప్రజలు పొలిమేరలో కంప అడ్డం వేశారు.
 
ప్రతిపక్షాలకు పరాభవం తప్పదు
ఎర్రవల్లి ప్రజలకు కృతజ్ఞతలు. మిగతా గ్రామాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలకు పరాభవం తప్పదు. సిద్దిపేట నియోజకవర్గం ఇమాంబాద్, అనంతగిరి ప్రాజెక్టుల కింద భూ సేకరణను సైతం కొన్ని దుష్టశక్తులు అడ్డుకోవాలని చూశారుు. ఇమాంబాద్ రిజర్వాయర్ విషయంలో 120 రోజులు టెంటు వేస్తే వీళ్లు వచ్చి ఒకటే రెచ్చగొట్టుడు.

కానీ 120 రోజుల తరువాత ఏం జరిగింది? నేను పోయి అదే టెంటు కింద కూర్చున్న. ఉన్న విషయాలు చెప్పి ఒప్పిం చిన. నిజంగా చెప్పాలంటే రైతులపై ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమ ఈ వచ్చిపో యే నాయకులకు ఉంటదా?  ఒక్కరోజు బాగోతంగాళ్లు వాళ్లు. ఇయ్యాల ఒస్తరు రేపు పోతరు. నేను మళ్లీ చెప్తున్నా.. ముం పు గ్రామాల ప్రజలను కడుపుల పెట్టుకొని చూసుకుంటా.
 - మంత్రి హరీశ్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement