జిల్లా అధికారుల లెక్క తేలింది! | officers counting clear | Sakshi
Sakshi News home page

జిల్లా అధికారుల లెక్క తేలింది!

Aug 28 2016 12:14 AM | Updated on Sep 4 2017 11:10 AM

కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదల చేసి, మ్యాప్‌లను సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.. ఉద్యోగుల విభజనపై కసరత్తు చేస్తోంది. పునర్విభజనతో ఏర్పడనున్న ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు.

– జిల్లా కార్యాలయాల్లోని పోస్టుల సంఖ్య 2732
– జిల్లాస్థాయిలోని ఉద్యోగుల సంఖ్య 2030
– కొత్తగా సృష్టించాల్సిన పోస్టులు 777
– ఉద్యోగుల విభజనపై అధికారుల కసరత్తు

ఖమ్మం జెడ్పీసెంటర్‌: కొత్త జిల్లాల ఏర్పాటు ముసాయిదా విడుదల చేసి, మ్యాప్‌లను సిద్ధం చేసిన అధికార యంత్రాంగం.. ఉద్యోగుల విభజనపై కసరత్తు చేస్తోంది. పునర్విభజనతో ఏర్పడనున్న ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు ఇంకా అందలేదు. అయినప్పటికీ, ఇప్పటివరకు 70 శాఖల్లోని ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి పంపింది. దసరా రోజున (పునర్విభజన) తరువాత రెండు జిల్లాల్లో పాలన అమల్లోకి వస్తుంది. ఇప్పటికే డివిజన్లు, మండలాలు; సరిహద్దు మ్యాప్‌లు సిద్ధమయ్యాయి. పాలనకు అనుగుణంగా కార్యాలయాలను గుర్తించి, అవసరమైన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వానికి పంపింది. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేస్తే పూర్తిస్థాయి ఆ ప్రక్రియ(విభజన)ను త్వరగా పూర్తిచేసేందుకు జిల్లా అధికారులు సిద్ధంగా ఉన్నారు.
––––––––––––––––
ఇదీ, ఉద్యోగుల లెక్క
(ఉమ్మడి) జిల్లాలోని 70 ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాల్లో 2732 పోస్టులు ఉన్నాయి. 2030 మంది ఉద్యోగులు ఉన్నారు. 708  పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు జిల్లాల్లోని ప్రధాన శాఖలలో మరో 777 పోస్టులను సృష్టించాల్సుంటుందని ఆయా శాఖల జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికల్లో తెలిపారు. ప్రస్తుతమున్న ఉద్యోగులను రెండు జిల్లాలకు (ఖమ్మం జిల్లాకు 1170 మందిని, కొత్తగూడెం జిల్లాకు 712 మందిని) తాత్కాలికంగా విభజించారు.
––––––––––––––––
ఎక్కడెక్కడ.. ఏయే శాఖలకు.. ఎంతెంతమంది..
జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికల ప్రకారం.. ఒక్కో కలెక్టరేట్‌కు 82 మంది ఉద్యోగులు అవసరమవుతారు. ప్రస్తుత కలెక్టరేట్‌లో 77 మంది మాత్రమే ఉన్నారు. పశుసంవర్థక శాఖలో 21 పోస్టులు ఉన్నాయి. మరో 15 కావాలి. బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌లో 15 పోస్టులు ఉన్నాయి. మరో 24 కావాలి. డీఆర్‌డీఏలో 84 పోస్టులకుగాను 46 మంది ఉన్నారు. వీరిని ఖమ్మానికి 31 మందిని, కొత్తగూడేనికి 15 మందిని కేటాయిస్తారు. డ్వామాలో 69 పోస్టులకుగాను 49 మంది ఉన్నారు. మరో 43 పోస్టులు కావాలి. ట్రెజరీలో 76 పోస్టులకుగాను 49 మంది ఉన్నారు. వీరిలో ఖమ్మానికి 41 మందిని, కొత్తగూడేనికి 35 మందిని సర్దుబాటు చేస్తారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌లో 22 పోస్టులకుగాను ఖమ్మానికి ఏడు, కొత్తగూడేనికి 15 కేటాయిస్తారు. మరో 24 పోస్టులు కావాలి. టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌లో 189 పోస్టులకుగాను 169 మంది ఉన్నారు. ఇంకా 177 పోస్టులు కావాలి. ఆత్మాలో 55 పోస్టులకుగాను 42 మంది ఉన్నారు. వీరిలో 39 మందిని ఖమ్మం జిల్లాకు, 16 మందిని కొత్తగూడెం జిల్లాకు పంచుతారు. ఎక్సైజ్‌ శాఖలో 347 పోస్టులకుగాను 267 మంది ఉన్నారు. వీరిలో 191 మందిని ఖమ్మం జిల్లాకు, 156 మందిని కొత్తగూడెం జిల్లాకు కేటాయిస్తారు. పోలీస్‌ శాఖలో 258 మందికిగాను 221 మంది ఉన్నారు. 115 మందిని ఖమ్మం జిల్లాకు,106 మందిని కొత్తగూడెంలో సర్దుబాటు చేస్తారు. రవాణా శాఖలో 44 పోస్టులకుగాను 31 మంది ఉన్నారు. వీరిలో ఖమ్మానికి 19 మందిని, కొత్తగూడేనికి 12 మందిని కేటాయిస్తారు.
––––––––––––––
మార్గదర్శకాల ఆధారంగా సర్దుబాటు
జిల్లావ్యాప్తంగా 30,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో జిల్లాస్థాయి కార్యాలయాల్లో 2,000 మంది పనిచేస్తున్నారు. మిగతా 28,000 మంది ఉద్యోగుల్లో 10,000 మందికి పైగా ఉపాధ్యాయులే ఉన్నారు. మిగతా 18,000 మందిలో గ్రామ, మండలస్థాయి ఉద్యోగులుæ ఉన్నారు. ఆయా శాఖల్లోని ఉద్యోగులను సీనియారిటీ జాబితా ప్రకారం కొత్త జిల్లాకు పంపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతానికి సర్దుబాటు మాత్రమే ఉంటుందని, నిబంధనలు వచ్చిన తరువాత విభజన పూర్తిస్థాయిలో విభజన ఉంటుందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఆప్షన్లు, స్థానికతపై స్పష్టత ఆధారంగానే సర్దుబాటు ఉంటుందన్నారు. జిల్లా కార్యాలయాల్లోని ఉద్యోగులు మినహా మిగతావారంతా (డివిజన్, మండల, గ్రామస్థాయి ఉద్యోగులు) ఎక్కడివారు అక్కడే ఉంటారు. (ఉమ్మడి) జిల్లా కార్యాలయాల్లోని అధికారుల్లో మొదటి సీనియారిటీలోగల వారిని ఖమ్మంలో, రెండో సీనియారిటీలోగల వారిని కొత్తగూడెంలో, మూడో సీనియారిటీలోగల వారిని ఖమ్మంలో, నాలుగో సీనియారిటీగల వారిని కొత్తగూడెంలో (ఇలా ప్రతి క్యాడర్‌లో) సర్దుబాటు చేస్తారు.
–––––––––––––––––
కొత్తగూడెం కలెక్టర్‌గా దివ్య?
కొత్తగా ఏర్పడే జిల్లాలకు జాయింట్‌ కలెక్టర్‌ స్థాయి క్యాడర్‌ అధికారులను కలెక్టర్లుగా నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలిసింది. ఇదే నిజమైతే, కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రస్తుత జాయింట్‌ కలెక్టర్‌ దేవరాజన్‌ దివ్య నియమితులవుతారు. ఆమె ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో, సమీక్ష సమావేశాల్లో పాల్గొంటున్నారు. పాలనావ్యవహారాలపై పట్టు బిగిస్తున్నారు. ఇటీవల జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు తనదైన శైలిలో జవాబులిçస్తూ సజావుగా సాగేలా చూశారు. ఈ నేపథ్యంలో, కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా దివ్యను పంపాలని పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement