
అంతా మా ఇష్టం..
మాకు ఇష్టమైతే వైద్యం చేస్తాం.. లేదంటే రెఫర్ చేస్తాం.. రోగి సీరియస్ కండిషన్లో.. ఉందా..? లేదా..?? అనే దాంతో సంబంధం లేదు..
♦ డాక్టర్లకు మనసుంటే వైద్యం.. లేదంటే రెఫర్
♦ సాధారణ కేసులూ వికారాబాద్, హైదరాబాద్కు
♦ నగరానికి పంపిన 10 నిమిషాలకే అంబులెన్స్లో కాన్పు.. తల్లీ బిడ్డా క్షేమం
♦ ఇక్కడ కాన్పు కష్టమంటూ వికారాబాద్కు పంపించిన వైద్యులు
♦ సిటీకి తీసుకు వెళుతుండగా మార్గమధ్యలోనే కాన్పు
♦ ఇంత పెద్ద క్లస్టర్ ఆస్పత్రిలో నీడిల్స్ లేని వైనం..
పరిగి: మాకు ఇష్టమైతే వైద్యం చేస్తాం.. లేదంటే రెఫర్ చేస్తాం.. రోగి సీరియస్ కండిషన్లో.. ఉందా..? లేదా..?? అనే దాంతో సంబంధం లేదు.. ఇది పరిగి ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల పని తీరు.. పరిగి సీహెచ్ఎన్సీ (కమ్యూనిటీ హెల్త్ అండ్ న్యూట్రిషన్ క్లస్టర్) ఆస్పత్రిలో శనివారం ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. పరిగి మండలంలోని రూప్ఖాన్పేట్కు చెందిన కల్పన (21) గర్భవతి.. ఆమెకు నొప్పులు రావటంతో శనివారం ఉదయం భర్త రఘు ఇతర కుటుంబసభ్యులు ఆమెను కాన్పు కోసం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొద్దిసేపటికి ఆమెను పరీక్షించిన డ్యూటీలో ఉన్న వైద్యురాలు ఇక్కడ కాన్పు కావడం కష్టంగా ఉందన్నారు. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు.
వెంటనే వికారాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. పరిగి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ ఆస్పత్రికి కుటుంబసభ్యులు ఆ గ్రామ ఆశ వర్కర్ కలిసి పరిగి ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్లో తీసుకువెళ్లారు. అయితే పరిగి నుంచి బయలు దేరి 10 నిమిషాలు కాగానే.. వికారాబాద్ చేరుకోకుండానే మార్గమధ్యలో అంబులెన్స్లోనే సాధారణ కాన్పు అయింది. కల్పన మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.
పరిస్థితి బాగా లేదు.. ఇక్కడ కాన్పు కష్టం అని వైద్యురాలు రెఫర్ చేయగా 10 నిమిషాల్లోనే తీసుకువెళుతున్న అంబులెన్స్లో కాన్పు కావటంపై కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్పు చేయడం తప్పించుకోవడానికే రెఫర్ చేశారని వారు ఆరోపించారు. ఓ పక్క ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు పీహెచ్సీల్లో సైతం కాన్పులు చేయాలని చెబుతుంటే.. నియోజకవర్గస్థాయి ఆస్పత్రుల్లో సైతం ఇలా చేతులకు పనిలేకుండా రెఫర్ మంత్రం పఠిస్తున్నారు.
ఆస్పత్రిలో నీడిల్స్ కూడా లేవట..
మరో పక్క ప్రతీ చిన్న విషయానికి చిన్న చిన్న ముందులు కూడా బయటి నుంచి తీసుకురావాలని చెప్పడం పరిగి ఆస్పత్రిలో సర్వసాధారణమైంది. కనీసం నీడిల్స్ కూడా పరిగి క్లస్టర్ ఆస్పత్రిలో లేవట.. ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి పరిగి ఆస్పత్రిని సందర్శించిన సమయంలో మందులు బయటకు రాసే విషయమై కొందరు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో స్థానికులు పెద్ద గొడవ చేశారు. ఆ సమయంలో అవసరమైతే ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి కొనుగోలు చేయాలని, బయటకు రాయొద్దని ఖరాకండిగా చెప్పారు. కంగా సంబంధిత శాఖ మంత్రి చెప్పి వారం తిరక్కుండానే మళ్లీ కథ మొదటికి వచ్చింది. మందు బిళ్లలు, నీడిల్స్ బయటినుంచి తీసుకురావాలని రాస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఎదుట ఉన్న చిన్నచిన్న దుకాణాల్లో కూడా నీడిల్స్ విక్రయిస్తున్నారు.