‘ఓటు’ అందరి హక్కు..!


పాలనలో మార్పునకు ‘వజ్రాయుధం’ 

ప్రజాస్వామ్య దేశంలో ఇది కీలకం

18 ఏళ్లు నిండితే తప్పనిసరి 

యువత అవగాహన కల్గి ఉండాలి 

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం




భారతదేశంలో ఓటు వజ్రాయుధం.. దేశపాలనలో దీనిపాత్ర కీలకం..ఓటుహక్కుతో అవినీతి పారద్రోలడానికి వీలుంటుంది. ఓరాజకీయ నాయకుడిని గద్దెనెక్కించాలన్నా.. గద్దె దించాలన్నా దేశపౌరుడికి ఓటుహక్కు తప్పనిసరి.ఓటుహక్కుతో ప్రశ్నించే అధికారం ఉంటుంది.దేశభవిష్యత్‌ యుతవ చేతుల్లో ఉన్నందున యువత ఓటు హక్కును గురించి అవగాహన కలిగి ఉండాలి. ఓటు విలువను ప్రజలకు చాటిచెప్పాలి.. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..    – ఆదిలాబాద్‌ అర్బన్, మంచిర్యాల టౌన్‌



ప్రజాస్వామ్య దేశంలో మనల్ని మనం పరిపాలించుకునేందుకు రాజ్యాంగం కల్పించిన ఒక గొప్ప అవకాశం ‘ఓటు’. పాలనలో మార్పునకు ఓటు వజ్రాయుధం. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును నమోదు చేసుకోవాలని భారత ఎన్నికల సంఘం సూచిస్తోంది.కానీ అవగాహన లేక చాలామంది ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారు. జిల్లాలో గతేడాది ఓటరు జాబితాలో నమోదు చేసుకున్న వారికి గుర్తింపు కార్డులు వచ్చాయి. వీటిని ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో జాతీయ ఓటరు దినోత్సవం అందిస్తారు. వీరితో పాటు సీనియర్‌ సిటిజన్లను బ్యాడ్జీలతో సత్కరిస్తారు.



ఉమ్మడి జిల్లాల్లో ఓటర్లు..

ఓటర్ల జాబితా లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో మొత్తం 16,89,790 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 8,46,989 మంది, మహిళలు 8,42,594 మంది ఉన్నారు. ఇతరులు 207 మంది ఉన్నారు. జనాభా ప్రకారం చూస్తే మహిళలు 62శాతం, పురుషులు 65శాతం ఉన్నారు. 2016 జూన్‌ నుంచి నవంబర్‌ వరకు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 10 వేల మంది ఓటు హక్కు కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే ప్రతి ఏడాది నిర్వహించే ఓటరు నమోదు కార్యక్రమం గతేడాదిలో చేపట్టలేదు.దీంతో ఓటుహక్కుపై యువతకు ఓటుహక్కుపై అవగాహన లేకుండా పోయింది.



ఓటరు దినోత్సవమే లక్ష్యం

 జనవరి 25న భారత ఎన్నికల కమిషన్‌ ఆవి ర్భవించింది. రోజును ఓటర్ల దినోత్సవం గా ప్రతిఏటా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.     ఈ రోజున ఈ యేడాది జనవరికి ఒక టో తేదీనాటికి 18ఏళ్లు నిండిన దేశపౌరుడిని ఓటరు జాబితాలో చేర్పించి వారికి ఓటరు గుర్తింపు కార్డులు అందజేసి ఓటు హక్కును కల్పిస్తుంది. పోలింగ్‌ కేంద్రాల్లో బూత్‌ స్థాయి అధికారులను అందుబాటులో ఉంచుతారు. గ్రామాల్లో ర్యాలీలు చేపడుతారు. ఊరూరా ఓటుహక్కు ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తారు.



నేడు మరో అవకాశం

ఓటర్ల దినోత్సవం సందర్భంగా నాలుగు జిల్లాల పరిధిలోని 2,322 పోలింగ్‌ స్టేషన్లలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతారు. పోలింగ్‌ స్టేషన్లలో బీఎల్‌వోలు అందుబాటులో ఉండి ఓటు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దీంతో పాటు అన్ని మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో, ఆర్డీవో, మున్సిపల్‌ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచుతారు. ఈరోజు ఓటరు కార్డులో తప్పులు సవరించడం, ఫొటోను సరి చేసుకోవడానికి వీలుంటుంది.



తొలి ఓటు హక్కు

1950 జనవరి 25న మొట్టమొదటిసారిగా దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పౌరుడికి తొలిసారిగా ఓటు హక్కు కల్పించారు. 1952లో మొట్ట మొదటిసారి నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటరు జాబితా ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1992 వరకు ఎలక్ట్రో ఫోటో ఐడెంటిటీ కార్డు ఉండేది కాదు. 1993లో భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా ఉన్న టీఎన్‌ శేషన్‌ ఓటర్ల గుర్తింపు కార్డుల ప్రక్రియను ప్రారంభించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top