నమ్మినవాళ్లను వెన్నుపోటు పొడవడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ ఆరోపించారు.
- చిత్తూరులో టీడీపీ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ ఆందోళన
చిత్తూరు : నమ్మినవాళ్లను వెన్నుపోటు పొడవడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ ఆరోపించారు. ఎన్నికలకు ముందు పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగలను వాడుకున్న ఆయన తీరా సీఎం కుర్చీ ఎక్కాక మాదిగలను మరచిపోయి, మరో వర్గాన్ని పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం చిత్తూరు నగరంలో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. కార్యాలయం గేటు వద్ద నినాదాలతో హోరెత్తించారు.
నరేంద్ర మాదిగ మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టలేని పరిస్థిత ఉండేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మార్పీఎస్ బాబుకు అండగా నిలిచిందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటాన్ని అణగతొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసులతో ముందస్తు సమావేశాలు నిర్వహించి ఎమ్మార్పీఎస్ చేపడుతున్న న్యాయపోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.