ఉద్యమంలా హరితహారం చేపట్టాలి | Movement should haritaharam | Sakshi
Sakshi News home page

ఉద్యమంలా హరితహారం చేపట్టాలి

Aug 2 2016 5:53 PM | Updated on Sep 4 2017 7:30 AM

మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు.

సంగారెడ్డి రూరల్‌: మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. మంగళవారం సంగారెడ్డి మండలం చింతలపల్లి గ్రామంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామానికి 40 వేల మొక్కలు తప్పకుండా నాటేలా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరైమన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కూలీలతో నాటిన మొక్కలకు కంచె ఏర్పాటు చేసేలా చూడాలన్నారు.

వాతావరణ కాలుష్యంతో మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడిన నేపథ్యంలో ప్రాణవాయువును ఇచ్చే చెట్టు ఎంతో అవసరమని తెలిపారు. దీనిని గుర్తించుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. రోజురోజుకు అటవీప్రాంతాలు తగ్గుముఖం పట్టడం వల్ల వాతావరణ సమత్యులత దెబ్బతింటుందన్నారు.

అలాగే వర్షాలు సకాలంలో కురవటంలేదని చెప్పారు. చెట్టు అధికంగా ఉంటే వర్షాలు సమృద్దిగా కురవటంతోపాటు వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలన్నారు. అలాగే గ్రామంలోని ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు, ప్రభుత్వ పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు.

ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు, ఉద్యోగులు సైతం హరితహారం అమలుపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ విద్యార్థులతో కలిసి గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటించారు.

నాటిన మొక్కలను కాపాడతామని విద్యార్థులతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, సర్పంచ్‌ పావని వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్‌, ఎంపీడీఓ సంథ్య, ఎంపీఓ ప్రవీణ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎం.ఎ.హకీం, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి యూసుఫ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement