వివాహిత ఆత్మహత్యాయత్నం | Married to commit suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్యాయత్నం

Jan 17 2017 4:45 AM | Updated on Sep 5 2017 1:21 AM

కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెద్దదేవులపల్లి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహితను సోమవారం త్రిపురారం పోలీసులు కాపాడారు.

 ప్రాణాలు కాపాడిన పోలీసులు  
త్రిపురారం : కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పెద్దదేవులపల్లి చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వివాహితను సోమవారం త్రిపురారం పోలీసులు కాపాడారు. ఈ ఘటన మండలంలోని పెద్దదేవులపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన ఠాకూర్‌ శ్రీలత, దుర్గాసింగ్‌ దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీలత తన రెక్కల కష్టంతో కుటుంబాన్ని పోషించుకుంటుంది. భర్త దుర్గాసింగ్‌ ఏ పనీ చేయకపోవడంతో పాటు శ్రీలతతో తరుచూ ఘర్షణ పడేవాడు. ఒక పక్క కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క భర్త వ్యవహారంతో మనస్తాపానికి గురై శ్రీలత ఆత్మహత్య చేసుకోవడానికి పెద్దదేవులపల్లి చెరువు వద్దకు వెళ్లింది.

 అది గమనించిన పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ వర్క్‌ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ స్థానిక పోలీసులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న హెడ్‌ కానిస్టేబుల్‌ కోడిరెక్క జోజీ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోయిన శ్రీలత ప్రాణాలు కాపాడారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను శ్రీలతను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. చెరువు వద్దనే ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. అనంతరం ఠాకూర్‌ శ్రీలత, దుర్గాసింగ్‌ దంపతులను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు రప్పించి కౌన్సిలింగ్‌ నిర్వహించి ఇంటికి పంపారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబుల్‌ కోడిరెక్క జోజీ, పెద్దదేవులపల్లి ఉప సర్పంచ్‌ ఠాకూర్‌ రాజారాంసింగ్, సిబ్బంది శేఖర్, నాగరాజు ఉన్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement