Representative image
త్రిపురలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇద్దరు మైనర్ పిల్లలపై కర్రతో దాడి చేసి చంపాడు. ఈ ఘటన మారుమూల ధలాయ్ జిల్లాలోని గండచెర్రా పరిధిలో ఉన్న ఉల్తాచ్ఛారా ఏడీసీ గ్రామంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నిందితుడు లాల్చువానామా బ్రూ మద్యం మత్తులో ఇంటికి వచ్చి ముందు తన భార్య రామ్టారు బ్రూపై దాడి చేశాడు.
ఆమె తమ పిల్లల్లో ఒకరిని తీసుకుని ఇంటి నుంచి తప్పించుకుంది. అయితే, మరో ఇద్దరు పిల్లలు (4 ఏళ్ల కుమారుడు, 12 ఏళ్ల కుమార్తె) ఇంట్లోనే ఉన్నారు. నిందితుడు కర్రతో ఆ ఇద్దరు చిన్నారులపై దాడి చేసినట్టు సమాచారం.
ఆ దాడిలో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, కేసు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను గండచెర్రా సబ్-డివిజనల్ ఆసుపత్రి మార్చురీలో పోస్ట్మార్టం కోసం ఉంచారు.


