అగర్తలా: త్రిపురలో గిరిజన ప్రాంతాలకు స్వయంప్రతిపత్తి కల్పించే ‘త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంపాలిత జిల్లా మండలి (టీటీఏఏడీసీ)’ఎన్నికల్లో ప్రద్యోత్ బిక్రమ్ మాణిక్య దేబ్ బర్మ సారథ్యంలోని తిప్రా మోథా పార్టీ(టీఎంపీ) ఘన విజయం సాధించింది. మండలిలో 28 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో ఏకంగా 24 చోట్ల గెలిచి టీఎంపీ తన సత్తా చాటింది. మిగతా నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించింది. గిరిజనులను మెప్పించడంలో విఫలమై సీపీ(ఐ), కాంగ్రెస్లు ఒట్టిచేతులతో మిగిలిపోయాయి. గ్రేటర్ తిప్రాల్యాండ్ ఏర్పాటు నినాదంతో ఆరేళ్ల క్రితం రాజకుటుంబీకుడు ప్రద్యోత్ సారథ్యంలో ఆవిర్భవించిన టీఎంపీ అనతికాలంలోనే రాష్ట్రంలో కీలక రాజకీయశక్తిగా ఎదిగింది. మండలిలో 28 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. మరో రెండు స్థానాలకు సభ్యులను గవర్నర్ నామినేట్ చేస్తారు.


