బజ్జీల వివాదం.. కత్తిపోట్లకు దారితీసింది | man attacked on his friends with knife in west godavari district | Sakshi
Sakshi News home page

బజ్జీల వివాదం.. కత్తిపోట్లకు దారితీసింది

Feb 23 2016 7:30 PM | Updated on Oct 8 2018 3:07 PM

బజ్జీల వివాదం.. కత్తిపోట్లకు దారితీసింది - Sakshi

బజ్జీల వివాదం.. కత్తిపోట్లకు దారితీసింది

అంచుకు మిరపకాయ బజ్జీలు తెచ్చుకుని పూటుగా మద్యం సేవించారు నలుగురు స్నేహితులు. బజ్జీలు బాగుండటంతో ఇంకొన్ని కొనుక్కున్నారు. ఎవరెన్ని పంచుకోవాలనే విషయంలో గొడవపడ్డారు.

తణుకు: అంచుకు మిరపకాయ బజ్జీలు తెచ్చుకుని పూటుగా మద్యం సేవించారు నలుగురు స్నేహితులు. బజ్జీలు బాగుండటంతో ఇంకొన్ని కొనుక్కున్నారు. ఎవరెన్ని పంచుకోవాలనే విషయంలో గొడవపడ్డారు. అదికాస్తా ముదిరిపాకాన పడటంతో బొడ్లో దాచుకున్న కత్తితీసి స్నేహితులపై దాడిచేశాడో వ్యక్తి. పశ్చిమగోదావరి జిల్లా పెరసవల్లి మండలం కందవల్లిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

మల్లేశ్వరం గ్రామానికి చెందిన మాండు వెంకటేశ్వర్లు(45), భేతాళ రవి(56), నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన పీమా వెంకటేశ్వర్లు(62), ఇందుకూరి రామచంద్రరాజు(46) స్నేహితులు. చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించేవీరు మంగళవారం జాతీయ రహదారి వద్దనున్న కేఎస్‌రావు వైన్స్‌లో మద్యం సేవించారు. వెళ్తూ వెళ్తూ పక్కనున్న దుకాణంలో బజ్జీలు కొనుక్కున్నారు. బజ్జీల పంపకాల్లో తేడా రావడంతో గొడవ మొదలైంది. గొడవ పెద్దది కావడంతో మాండు వెంకటేశ్వర్లు తన దగ్గరున్న కత్తితో మిగతా ముగ్గురిపై దాడి చేశాడు. ఈ దాడిలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. వెంకటేశ్వర్లును గ్రామస్తులు పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకబాదారు. గాయపడిన ముగ్గుర్నీ తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement