రీడింగ్ లెక్క.. ఇక పక్కా!
విద్యుత్ వినియోగం నమోదు వివరాలు తీసే రీడర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యుత్ శాఖ నడుం బిగించింది. విద్యుత్ బిల్లుల రీడింగ్ తీసేందుకు స్కాన్ పరికరం ఏర్పాటు చేసింది. దీంతో వినియోగదారుడు వాడిన ప్రతి యూనిట్కు పక్కగా బిల్లు వస్తుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
– విద్యుత్ వినియోగం నమోదుకు స్కానింగ్ పరికరాలు
– అక్రమ రీడింగ్లకు కళ్లెం వేసేందుకు యత్నం
నల్లజర్ల : విద్యుత్ వినియోగం నమోదు వివరాలు తీసే రీడర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు విద్యుత్ శాఖ నడుం బిగించింది. విద్యుత్ బిల్లుల రీడింగ్ తీసేందుకు స్కాన్ పరికరం ఏర్పాటు చేసింది. దీంతో వినియోగదారుడు వాడిన ప్రతి యూనిట్కు పక్కగా బిల్లు వస్తుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ఇలా..
విద్యుత్ మీటర్ రీడింగ్ను విద్యుత్ శాఖ నియమించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు తీస్తున్నారు. ఆయా తేదీలను బట్టి ప్రతి ఇంటికీ, దుకాణాలు, సంస్థలకు వెళ్లి మీటర్ రీడింగ్ యూనిట్ల సంఖ్యను ట్యాబ్లో నమోదు చేయడం ద్వారా బిల్లు ఇస్తున్నారు. ఈ సమయంలో ఒక్కోసారి కటి, రెండు యూనిట్ల అటుఇటు జరిగితే ధరల శ్లాబులు మారిపోతున్నాయి. ఉదాహరణకు ఒక ఇంటికి నెలలో విద్యుత్ వినియోగం 101 యూనిట్లు ఉంటే 99 యూనిట్లుగా నమోదు చేస్తే బిల్లులో దాదాపు రూ.50 వరకు తేడా వస్తుంది. 99 యూనిట్లు ఉన్న వారికి పొరపాటున ఎక్కువ నమోదు చేసినా బిల్లులో తేడా వస్తుంది. ఒకటి, రెండు యూనిట్ల తేడాలో ధరల్లో వ్యత్యాసం వస్తోంది. దీంతో సంస్థతో పాటు వినియోగదారుడూ నష్టపోతున్నారు. కొందరు వ్యక్తులు, సంస్థలకు చెందిన వారు రీడింగ్ తీసే సిబ్బందితో ‘మామూలు’గా పరిచయాలు పెంచుకుని మీటర్ రీడింగ్లో వ్యత్యాసాలు చూపిస్తున్నట్టు విద్యుత్ అధికారులు గుర్తించారు. చాలా చోట్ల ఈ పరిస్థితులు ఉండడంతో ఇందుకు పరిష్కారంగా స్కానింగ్ యంత్రాన్ని కూడా ఉపయోగిస్తున్నారు.
ఇక నుంచి ఇలా..
ఇప్పటి వరకు రీడింగ్లో తలెత్తుతున్న లోపాలను గ్రహించిన విద్యుత్ సంస్థ అన్ని గ్రామాల్లో ఐఆర్ఫోర్టు మీటర్లు అమర్చారు. విద్యుత్ రీడింగ్ తీసే రీడర్ స్కానర్ పరికరాన్ని మీటరు ముందు పెడితే ఎన్ని యూనిట్ల విద్యుత్ వినియోగించారన్న విషయాన్ని స్కాన్ చేస్తుంది. వినియోగించిన యూనిట్లకు బిల్లు వస్తుంది. ఈ స్కానింగ్ రిపోర్టు అధికారులతో పాటు ఆన్లైన్లో నమోదవడంతో రీడర్ల అక్రమాలకు చెక్ పడుతుంది. యూనిట్లలో తేడాకు అవకాశం ఉండదని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. రీడింగ్కు స్కానర్ ఉపయోగించడం ద్వారా అటు సంస్థకు, ఇటు వినియోగదారుడికి నష్టం వచ్చే అవకాశం ఉండదని ఆ శాఖ అధికారులు తెలిపారు.