నల్ల కుబేరులను, ఆర్థిక నేరస్తులను దగ్గర పెట్టుకుని సాధారణ ప్రజలను బజారుపాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడుకు పాలించే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ విమర్శించారు.
అనంతపురం: నల్ల కుబేరులను, ఆర్థిక నేరస్తులను దగ్గర పెట్టుకుని సాధారణ ప్రజలను బజారుపాలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడుకు పాలించే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ విమర్శించారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జన్ ధన్ ప్రతి ఖాతాలో రూ.15లక్షలు వేస్తానని ఓట్లు వేయించుకొని ప్రజల కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పింఛన్లు రాక వృద్దులు, ఉపాధి బిల్లులు సకాలంలో అందక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కష్టార్జితంతో వస్తున్న డబ్బులను కూడా తీసుకోలేని దుర్బర పరిస్థితులు సామాన్యులకు ఉంటే... నల్లకుబేరులు మాత్రం వందల కోట్ల నోట్లు మార్పిడి చేసుకోవడం బట్టి చూస్తే ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది ఏ పాటితో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రమణ, వాసు, వశికేరి శివ, కొండారెడ్డి, గోవిందు తదితరులు పాల్గొన్నారు.