'చంద్రబాబు దళిత వ్యతిరేకి'
►నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు
పొన్నూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వారి ఎదుగుదలకు సంబంధించిన అన్ని ద్వారాల్ని మూసివేస్తున్నారని నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కత్తి పద్మారావు విమర్శించారు. ఆయన శనివారం గుంటూరు జిల్లా పొన్నూరు అంబేడ్కర్ నగర్లోని లుంబినీవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గ్రూప్–2 ప్రిలిమ్స్లో రిజర్వేషన్లకు గండి కొట్టడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అన్నారు. గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామకాల్లో తప్పనిసరిగా రిజర్వేషన్లు పాటించాలని, పోస్ట్ డాక్టరేట్ స్కాలర్షిప్లు డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా మంజూరు చేయాలని, దళితులకు చెందిన అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు కూడా విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రాధమిక విద్యను దెబ్బ తీసేలా వ్యవహరిస్తోందని, బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలని కత్తి పద్మారావు కోరారు.