ఇస్రో.. దూసుకుపో..
నాలుగు దశాబ్దాల కిందట ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నలుగురిని వేడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అగ్రరాజ్యాలు చేయని సాహసాన్ని చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). అంతరిక్ష పరిశోధనల్లో మన దేశాన్ని మొదటిమెట్టుపై నిలబెట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.
- నేడు పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగం
- ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించబోతున్న ఇస్రో
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు.. ప్రయోగం విజయవంతం కావాలంటూ ఆకాంక్ష
(సాక్షిప్రతినిధి, అనంతపురం)
నాలుగు దశాబ్దాల కిందట ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి నలుగురిని వేడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అగ్రరాజ్యాలు చేయని సాహసాన్ని చేస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో). అంతరిక్ష పరిశోధనల్లో మన దేశాన్ని మొదటిమెట్టుపై నిలబెట్టేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఒకేసారి 104 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ37 ద్వారా నేడు(బుధవారం) అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించబోతోంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఉదయం 9.28 గంటలకు ఈ రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం కావాలని, భారత కీర్తి పతాకం దశదిశలా రెపరెపలాడాలని ‘అనంత’ వాసులతో పాటు యావత్ భారతీయులు మనసారా కోరుకుంటున్నారు.