
రూ.10 చిన్న మొత్తమే కదా: గంటా
పది రూపాయలు చాలా చిన్న మొత్తం అని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
పది రూపాయలు చాలా చిన్న మొత్తం అని ఆంధ్ర ప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. రాజధాని కోసం స్కూల్ పిల్లల నుంచి నిర్బంధ విరాళాల వసూళ్లపై హైకోర్టు సీరియస్ అయిన నేపథ్యంలో ఆయన బుధవారమిక్కడ స్పందించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములుగా చేసేందుకే విరాళాలు సేకరించాలని భావించినట్లు ఆయన తెలిపారు.
అంతకు ముందు అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కొక్కరూ రూ.పది రూపాయలు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి రూ.10 ఇవ్వాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం హుకుం జారీ చేసింది. ‘మై కేపిటల్, మై అమరావతి, మై బ్రిక్’ పేరిట ఈ చందాలు వసూలు చేయాలని జిల్లాల విద్యాశాఖ అధికారులకు సర్క్యులర్ను పంపారు.
విద్యార్థుల నుంచి విరాళాల సేకరణను సవాల్ చేస్తూ బుధవారం పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారణ కు స్వీకరించిన హైకోర్టు విద్యార్థుల నుంచి విరాళాల సేకరణకు సర్క్యులర్ ఎలా విడుదల చేస్తారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విద్యాశాఖ జారీ చేసిన సర్క్యులర్ ను కొట్టివేసింది.