అన్నాచెల్లికి అంతర్జాతీయ గుర్తింపు | international identity of brother and sister | Sakshi
Sakshi News home page

అన్నాచెల్లికి అంతర్జాతీయ గుర్తింపు

May 7 2017 12:28 AM | Updated on Sep 5 2017 10:34 AM

అన్నాచెల్లికి అంతర్జాతీయ గుర్తింపు

అన్నాచెల్లికి అంతర్జాతీయ గుర్తింపు

‘అనంత’ నగరానికి చెందిన వర్షిత్‌కుమార్, హారిక షటిల్‌లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ‘అనంత’ నగరానికి చెందిన వర్షిత్‌కుమార్, హారిక షటిల్‌లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. షటిల్‌ క్రీడా ప్రపంచంలోకి అడుగిడిన రెండేళ్లలోనే అంతర్జాతీయ ఆటలో పాల్గొని ఔరా అనిపించారు. టేబుల్‌టెన్నిస్‌లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు సాధించిన వాళ్ల మేనమామ శ్రీధర్‌బాబే వారికి రోల్‌ మోడల్‌. ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో వర్షిత్‌కుమార్‌ 9వ తరగతికి, హారిక 5వ తరగతికి వెళ్లనున్నారు.

ఒలంపిక్సే లక్ష్యంగా వర్షిత్‌
2014లో స్థానిక ఇండోర్‌ స్టేడియంలో కోచ్‌ జీవన్‌కుమార్‌ వద్ద షటిల్‌ పాఠాలు నేర్చుకున్న వర్షిత్‌ తన మొదటి టోర్నీలోనే రెండవ స్థానంలో నిలిచాడు. అండర్‌ - 13 స్కూల్‌ గేమ్స్‌లో డబుల్స్‌ విన్నర్‌గా ఒకసారి, సింగల్స్‌ రన్నర్‌గా రెండుసార్లు నిలిచాడు. రూరల్‌ చాంపియన్‌షిప్‌లో మూడవ స్థానంలో నిలిచి జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌కు ఎదిగాడు. అందులో మూడవ స్థానం సాధించి జాతీయస్థాయి టోర్నీకి ఎంపికయ్యాడు. హర్యానాలో నిర్వహించిన జాతీయస్థాయి టోర్నీలో వెండి పతకం తెచ్చాడు. దీంతో ఇండో - నేపాల్‌ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనే వచ్చింది. అక్కడ బంగారు పతకం సాధించాడు. వర్షిత్‌ భారతదేశం తరపున ఒలంపిక్స్‌లో రాణించాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. దానిని నెరవేర్చేందుకు శ్రమిస్తున్నాడు.

రెండింటా రాణిస్తున్న హారిక
సోదరునితో కలిసి ఇండోర్‌ స్టేడియంలోనే షటిల్‌ నేర్చుకున్న హారిక చదువులోనూ దిట్ట. ఇంటర్నేషనల్‌ మ్యా«థ్స్‌ ఒలంపియాడ్‌లో బంగారు పతకం సాధించింది. జిల్లాస్థాయి టోర్నీలో 2015లో విన్నర్‌గాను, 2016లో రన్నర్‌గానూ నిలిచింది. రాష్ట్రస్థాయి పోటీల్లో మూడవ, రెండవ స్థానాల్లో నిలిచింది. జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో జాతీయస్థాయి టోర్నీలో రెండవ స్థానం సాధించి, యూత్‌ రూరల్‌ గేమ్స్‌ జాతీయస్థాయి టోర్నీలో బంగారు పతకం తెచ్చింది. అంతర్జాతీయ స్థాయి ఇండో - నేపాల్‌ టోర్నీలోనూ బంగారు పతకం సాధించింది. గత నెలలో నిర్వహించిన జోన్‌ - 1 గ్రిగ్స్‌లో డబుల్స్‌ విన్నర్‌గా నిలిచింది. క్రీడలతోపాటు చదువులోనూ రాణిస్తూ రెండింటా సత్తా చాటుతోంది.

కుటుంబ నేపథ్యం
తండ్రి గణేష్‌కుమార్‌ది వ్యాపారం. తల్లి సురేఖ వైద్యశాఖలో పని చేస్తున్నారు. పిల్లలిద్దరూ ఆటల్లో రాణించడం వారికి చాలా ఆనందాన్నిస్తోంది. సింధు స్ఫూర్తితో ఒలంపిక్స్‌ లక్ష్యంగా బాబును, చదువులో రాణించే విధంగా పాపను ముందుకు తీసుకెళ్తున్నారు. కోచ్‌ జీవన్‌కుమార్‌ సహకారం వల్లే తమ పిల్లలు ఈ స్థాయికి వచ్చారని చెబుతున్న గణేష్‌, సురేఖ వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement