తుపాకుల కలకలం వెనుక కథేంటి? | gun culture Growing in Medak district | Sakshi
Sakshi News home page

తుపాకుల కలకలం వెనుక కథేంటి?

Apr 11 2016 3:48 PM | Updated on Oct 16 2018 3:12 PM

ప్రశాంతంగా ఉండే చోట ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, బెదిరింపులు రాజ్యమేలుతున్నాయి.

ప్రశాంతంగా ఉండే చోట ల్యాండ్‌ సెటిల్‌మెంట్లు, బెదిరింపులు రాజ్యమేలుతున్నాయి. కిరాయి హంతకముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. నేరాల రేటు తక్కువగా ఉండే మెదక్ జిల్లా నంగునూరు మండలంలో గన్ కల్చర్ కలకలం రేపుతోంది.

 

రెండు రోజుల క్రితం రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు పరస్పరం ఘర్షణ పడగా ఒకరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో ముగ్గురు పరారయ్యారు. కాల్పుల్లో గాయపడిన వ్యక్తి దొరికాడు. ఆ ఇంట్లో రెండు తుపాకులు, ఒక తపంచా దొరికాయి. వీరు ఏదైనా దోపిడీ ముఠా సభ్యులా.. లేక మాఫియా గ్యాంగ్‌కు చెందిన వారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పారిపోయిన వ్యక్తుల వద్ద పెద్దబ్యాగ్ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఎక్కడో సెటిల్‌మెంట్ చేసి సంపాదించన డబ్బు పంపకాల విషయంలో తేడాలు రావడంతో దాడులు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
 
నంగునూరు మండలం మారుమూల ప్రాంతం కావడంతో పాటు రాజగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్ పీస్ జోన్‌లో ఉండడంతో అసాంఘిక శక్తులు అడ్డాగా మార్చుకుంటున్నాయి. పక్క జిల్లాకు చెందిన ఒక వ్యక్తి నంగునూరు మండలానికి చెందిన మరో వ్యక్తితో కలసి దుబాయికి తీసుకెళ్తామని ఆశచూపి కొందరి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వినికిడి. అయితే, వారికి డబ్బు అందజేసిన వారు ఒత్తిడి చేయటంతో వారిని బెదిరించేందుకు ఉత్తర్‌ప్రదేశ్ జిల్లా వారణాసి ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులను ఇక్కడికి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ల్యాండ్ సెటిల్‌మెంట్లు చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. దుండగులు హన్మకొండ ప్రదాన రహదారిపై రాంపూర్ క్రాస్‌రోడ్డు వద్ద గతంలో దాబా హోటల్ నడిచిన ఇంట్లో పది రోజులుగా బస చేస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.

నాడు వెల్కటూర్.. నేడు రాంపూర్..
గత డిసెంబర్ నెలలో వెల్కటూర్‌కు చెందిన బత్తిని వెంకటస్వామి ఇంట్లో పోలీసులు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో లారీలో తరలిస్తున్న 200క్వింటాళ్ల గంజాయిని రాజగోపాల్‌పేట పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నుంచి మెదక్ జిల్లా రాజగోపాల్‌పేట వరకు ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ లేకపోవడంతో నిఘా తక్కువగా ఉంటుంది. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు నంగునూరు మండలం అనువుగా మారింది. అలాగే ఈప్రాంతంలో దాబా హోటళ్లు ఉండడంతోపాటు మద్యం లభిస్తుండటం కూడా అసాంఘిక శక్తులకు ఆసరాగా మారింది.

 

Advertisement
 
Advertisement
Advertisement