రాయలసీమలోని మూడు జిల్లాలను రాజధాని అమరావతికి కలుపుతూ నిర్మించబోయే రహదారిని నల్లమల అటవీప్రాంతం మీదుగా
♦ నాలుగు, ఆరు మార్గాలుగా నిర్మించాలని సీఎం ఆదేశం
♦ కృష్ణపట్నం నుంచి తాడిపత్రి, గుత్తి మీదుగా నాలుగు లేన్ల రోడ్డు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాయలసీమలోని మూడు జిల్లాలను రాజధాని అమరావతికి కలుపుతూ నిర్మించబోయే రహదారిని నల్లమల అటవీప్రాంతం మీదుగా అనుసంధానం చేయాలని సీఎం చంద్రబాబు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. రోడ్లు భవనాల శాఖ చేపట్టనున్న అభివృద్ధి పనులను సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల నుంచి వచ్చే రహదారులను నాలుగు లేన్లుగా నిర్మించి, అవి కలిసే చోటు నుంచి అరు లేన్ల రదారిగా అమరావతికి వరకు నిర్మించాలని ఆదేశించారు. అనంతపురం నుంచి అమరావతికి ఇప్పుడున్న 472 కిలోమీటర్ల మార్గాన్ని నేరుగా నిర్మిస్తే దాదాపు 86 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు. అప్పుడు మొత్తం 386 కిలోమీటర్లు ఉండే ఈ మార్గంలో 25 కిలోమీటర్లు మేర అటవీ ప్రాంతం ఉంటుందని అన్నారు. ఈ రహదారి పూర్తయితే అనంతపురం నుంచి రాజధానికి కేవలం 5 గంటల్లో రావచ్చన్నారు.
పారిశ్రామికవాడలు, పర్యాటకాభివృద్ధి
కృష్ణపట్నం నుంచి రాపూరు, కడప, చిట్వేలి, తాడిపత్రి, గుత్తి మీదుగా నాలుగు లేన్ల రోడు ్డను నిర్మించి దాన్ని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారికి అనుసంధానించాలని సీఎ ం చెప్పారు. ఇచ్ఛాపురం-తడ మధ్య ఏర్పాటు చేస్తున్న బీచ్ కారిడార్ అభివృద్ధి ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయం దగ్గర ఉన్న 1.5 ఎకరాల ఆర్అండ్బీ స్థలంలో భారీ భవనాల నిర్మాణానికి సీఎం ఆమోదం తెలిపారు. కాగా రాజధానిలో 25 వేల చదరపు అడుగుల భూమి ఇస్తే భారీ భవంతిని ఉచితంగా నిర్మించి ఇస్తానని జనచైతన్య గ్రూపు ప్రతినిధి మాదల చైతన్య చెప్పారు. ఆయన సీఎంను కలిశారు. మాదల చైతన్య తన తల్లి శకుంతల పేరిట ఈ నిర్మాణానికి పూనుకున్నారని సీఎం అభినందించారు.