దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శనివారం వైఎస్ఆర్ సీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.
‘వైఎస్ జగన్ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటం’
Nov 12 2016 6:46 PM | Updated on Jul 25 2018 4:09 PM
అనంతపురం : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి శనివారం వైఎస్ఆర్ సీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. పార్టీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి తదితరులు తాడిపత్రిలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సీపీ నేతలు మాట్లాడుతూ ... ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని అన్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో పోలీసులు పని చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి ప్రజలకు అందుబాటులో ఉంటానని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాడతానని ఆయన తెలిపారు.
కాగా అంతకు ముందు కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించేందుకు వస్తున్న ఆయనను అడ్డుకోవడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయలంటూ వై.విశ్వేశ్వరరెడ్డి ఆందోళన చేపట్టడంతో నిన్న ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement