వెబ్ ల్యాండ్తో గుండెలు లబ్డబ్ | farmers demands not to cancel pasbooks in guntur | Sakshi
Sakshi News home page

వెబ్ ల్యాండ్తో గుండెలు లబ్డబ్

Jul 16 2016 7:51 PM | Updated on Oct 1 2018 2:11 PM

పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయొద్దని వినతి
తప్పుల తడకగా ఆన్లైన్లో భూ రికార్డులు రైతుల్లో ఆందోళన


గురజాల:
పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడంపై నియోజకవర్గంలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఉంటే భరోసాగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఆన్లైన్లో భూ రికార్డులు నమోదు కూడా తప్పుల తడకగా ఉందని, భూముల సర్వేల్లో తప్పులు, విస్తీర్ణాలు మారిపోవడం, హక్కుదార్ల పేర్లు కూడా వెబ్ల్యాండ్లో మారిపోయే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఆన్లైన్లో భూముల వివరాలు, విస్తీర్ణం నమోదు, యజమాని పేరు వంటివి చూసుకునే పరిజ్ఞానం రైతులకు ఉండదని వారు ఆయోమయంలో పడతారని రైతు సంఘాల నేతలు అంటున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలను, టైటిల్ డీడ్స్ను వ్యవస్థను రద్దు చేయడం వల్ల  రైతుల ఆస్తులకు రక్షణ ఉండదని, ఈ విధానం బడా బాబులకే కొమ్ము కాసేదిగా ఉందని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పాస్ పుస్తకాలను రద్దుచేస్తూ జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎల క్ట్రానిక్ పాస్ బుక్ (ఈ పాస్ బుక్) విధానంపై రైతులకు అసలు అవ గాహన లేదని, ఈ విధానం అమల్లోకి  వస్తే అక్రమాలకు మరింత ఎక్కువవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

పట్టాదారు పాసు పుస్తకాలతో రైతులకు భరోసా
పాసు పుస్తకాలు టైటిల్ డీడ్స్ రైతులకు ఒక భరోసానిస్తాయి. వెబ్ ల్యాండ్, ఈ పాస్ పుస్తకాలు విధానం లోపాల పుట్ట. యథావిధిగా పట్టాదారు పుస్తకాలు కొనసాగించాలి. పుస్తకాలు ఉంటేనే రైతులకు ధైర్యంగా ఉంటుంది. పాసు పుస్తకాల రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి.ఆన్లైన్లో భూ రికార్డులు వ్యవహారం దారుణంగా ఉంది.       
-బత్తుల చంద్రం,రైతు
 
ఆన్లైన్లో ఇబ్బందులు తప్పవు
ఆన్లైన్తో రైతులకు ఇబ్బందులు తప్పవు. చదువురాని వారు పట్టాదారు పాసు పుస్తకాలు ఉంటే ధైర్యంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసుకోవాలంటే వారికి తెలియదు. దీంతో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. పభుత్వం ప్రవేశపెట్టిన జీవోను రద్దు చేసి యథావిధిగా పట్టాదారు పుస్తకాలు కొనసాగించాలి.  
- ఎం. గంగానాయక్

Advertisement
 
Advertisement
Advertisement