
పెద్దదర్గా సన్నిధిలో ప్రముఖ దర్శకుడు మురుగదాస్
ప్రముఖ సినీ దర్శకుడు మురుగదాస్ శుక్రవారం పెద్ద దర్గాను దర్శించుకున్నారు.
కడప సెవెన్రోడ్స్: ప్రముఖ సినీ దర్శకుడు మురుగదాస్ శుక్రవారం పెద్ద దర్గాను దర్శించుకున్నారు. తొలుత ఆయన జిల్లా మహేష్బాబు ఫ్యాన్స్ అధ్యక్షుడు సమద్ ఇంట్లో తేనేటి విందు స్వీకరించారు. అనంతరం దర్గాకు వచ్చిన ఆయనకు దర్గా కమి టీ కార్యదర్శి నయీమ్, ముజావర్ అమీర్ దర్గా గురువుల చరిత్ర, విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా ఆయనకు సం ప్రదాయంగా పేటా చుట్టారు. మురుగదాస్ స్వయంగా పూలచాదర్ను తెచ్చి ప్రధాన మజార్ వద్ద సమర్పించారు. అనంతరం ఆయన దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇంతకుముందు కత్తి సినిమా షూటింగ్ కోసం గండికోటకు వచ్చిన సందర్భంగా దర్గా గురువులను దర్శించుకున్నానని, ఇక్కడికి రావడం ఇది రెండవసారి అని తెలిపారు. దర్గా ప్రార్థనల్లో తనకు ఆశావహ దృక్పథం, ఆత్మశక్తి లభించినట్లయిందన్నారు. ప్రస్తుతం గండికోటలో మహేష్బాబు హీరోగా చిత్రం షూటింగ్ చేస్తున్నామని, దర్గాలో ప్రార్థిస్తున్న సమయంలో దాన్ని జూన్ 23న విడుదల చేయాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. అసిస్టెంట్ డైరెక్టర్లు మోహన్, సునీత, టెక్నిషియన్ కామత్, మి«థున్, పర్సనల్ అసిస్టెంట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.