సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మె | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మె

Published Sun, Aug 14 2016 10:05 PM

సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సమ్మె

విజయవాడ(గాంధీనగర్‌) : 
కార్మికుల సమస్యల పరిష్కారానికై సెప్టెంబర్‌ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు , సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ సమ్మెకు సన్నద్ధంలో భాగంగా ఈనెల 16న అన్ని కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. 17 నుంచి 22వ తేదీ వరకు జిల్లా, పట్టణాల స్థాయిలో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు అన్ని పట్టణాలలో ఫ్యాక్టరీ గేట్ల వద్ద సభలు, పాదయాత్రలు, ప్రచార యాత్రలు నిర్వహించాలని, ఈనెల 31న సమ్మెపై ప్రచారం చేస్తూ బైక్‌ ర్యాలీలు అన్ని పట్టణాల్లో నిర్వహించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించినట్లు చెప్పారు. సెప్టెంబర్‌ 2న పెద్ద ఎత్తున కార్మికులు సమ్మెలో పాల్గొని తమ నిరసన తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బి.వెంకటసుబ్బయ్య(ఐఎన్‌టీయూసీ), పి.పోలారి (ఇఫ్టూ), పి.రామ్‌దేవ్, చలసాని వెంకటరామారావు (ఏఐటీయూసీ), బరబన నాగేశ్వరరావు, ఆసుల రంగనాయకులు పాల్గొన్నారు. 
 
 

Advertisement
Advertisement