సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్టీల్ లిక్విడ్ పడి తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. సోమవారం సాయంత్ర సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్లాంట్ లోపల భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ప్రమాదానికి కారణం మెటల్ లిక్విడ్ పేలడం అని తెలుస్తోంది. 1500 డిగ్రీల వేడితో వెళుతున్న మెటల్ లిక్విడ్ పేలడం వల్ల ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మృతిచెందిన వారిలో ఆరుగురి వివరాలు అధికారులు ప్రకటించారు. మృతులు.. రావూరి మల్లికార్జున రావు, పల్లెల శ్రీనివాసరావు, అప్పారావు, సత్యానంద్ బొల్లా, హరిబాబు, రాజులుగా గుర్తించారు. మరో ఇద్దరి సమాచారం తెలియాల్సి ఉంది.
కాగా గతంలోనూ పలుమార్లు స్టీల్ ప్లాంట్లో ప్రమాదాలు జరిగాయి. గతేడాది స్టీల్ మెల్టింగ్ మిషన్లో షార్ట్ సర్క్యూట్తో హైడ్రాలిక్ ఆయిల్ లీకై మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేయడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ఈ సారి ప్రమాదంలో పలువురు కార్మికులు మృతిచెందారు.



