ఎమ్మిగనూరు యార్డులోనే పత్తి కొనుగోలు | cotton purchasing at yemmiganur | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరు యార్డులోనే పత్తి కొనుగోలు

Oct 16 2016 11:52 PM | Updated on Sep 4 2017 5:25 PM

మార్కెట్‌యార్డులో తనిఖీలు నిర్వహిస్తున్న కమిషనర్‌

మార్కెట్‌యార్డులో తనిఖీలు నిర్వహిస్తున్న కమిషనర్‌

ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులో వెంటనే పత్తికొనుగోళ్లను ప్రారంభించాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ మల్లికార్జునరావు ఆదేశించారు.

–వచ్చే వారం నుంచి సీసీఎస్‌ ద్వారా ప్రారంభం
 –మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ మల్లికార్జున రావు
ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డులో వెంటనే పత్తికొనుగోళ్లను ప్రారంభించాలని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ మల్లికార్జునరావు ఆదేశించారు. ఆదివారం ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ను ఆయన పరిశీలించారు. పత్తి రైతులకోసం ఏర్పాటు చేసిన టీఎంసీ యార్డు, యార్డు క్యాంటీన్‌లను ఆయన పరిశీలించారు. మార్కెట్‌ యార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై యార్డు కార్యదర్శి జయలక్ష్మితో చర్చించారు. రైతుల కోసం క్యాంటీన్‌లో ఫాస్టుఫుడ్‌ తరహాలో సేవలు, ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు, మార్కెట్‌ ప్రహరీ గోడ నిర్మాణం ,యార్డులో బ్యాంక్‌ సేవలు అందించాలని చెప్పారు. జీరో వ్యాపారాలపై నిఘా పెంచాలని అధికారులను ఆదేశించారు. రైతు బజారు ఏర్పాటుకు స్థల పరిశీలన చేపట్టాలని సూచించారు.అనంతరం విలేకరులతో మాట్లాడుతూ  వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 43మార్కెట్లలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లను చేపట్టాలని సూచించామన్నారు.బయట వ్యారులు రేట్లను తగ్గించినప్పుడు ప్రత్యామ్నాయంగా సీసీఐ ఉంటుందన్నారు. క్వింటాల్‌కు రూ.4,160 ప్రకారం ధర ఉంటుందన్నారు.
 గతంలో సీసీఐ కొనుగోళ్ల పేరుతో భారీ అక్రమాలు జరిగిన విషయం వాస్తవమేనని, దీనిపై ,ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాయలసీమ జిల్లాలో ఉల్లిపంటను అధికంగా సాగుచేశారని, కిలో రూ.6కు తగ్గకుండా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామన్నారు.  అనంతరం కమిషన్‌ మర్చంట్స్‌ ఉరుకుందయ్యశెట్టి, యూటి శంకర్,ప్రతాప్‌ కిట్టు, శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ మార్కెట్‌లో టెండర్‌ఫారాలు సరిగ్గా లేవని, బ్యాంక్‌ సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏడీఎం సత్యనారాయణ చౌదరీ,సెక్రటరీ జయలక్ష్మి, డీఈఈ సుబ్బారెడ్డి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ సుందరం, తదితరులు పాల్గొన్నారు. 
చైర్మెన్‌డుమ్మా: మార్కెట్‌ కమిషనర్‌ మల్లికార్జునరావు ఎమ్మిగనూరు మార్కెట్‌ పరిశీలనకు వస్తున్నట్లు సమాచారం రావటంతో చైర్మెన్‌ సంజన్న ముఖం చాటేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు,మార్కెట్‌యార్డు సిబ్బందిని వేధించటం, ప్రతి పనిలో కమీషన్ల కోసం ఇబ్బంది పెట్టడం తదితర వాటిపై కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తారనే నెపంతో సంజన్న ముఖం చాటేసినట్లు కమీషన్‌ ఏజెంట్లు చర్చించుకోవటం గమనార్హం.
 

Advertisement
 
Advertisement
Advertisement