ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో దారుణం
ఎమ్మిగనూరు రూరల్: మద్యం మత్తులో ఓ వ్యక్తి ప్రభుత్వాస్పత్రిలో అందరూ చూస్తుండగానే భార్యను కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎమ్మిగనూరు మండలం గుడేకల్కు చెందిన బోయ బెలగల్ రామయ్య కూలి పనులు చేసుకుంటూ మద్యానికి బానిసయ్యాడు. భార్య నరసమ్మను తరచూ డబ్బుల కోసం వేధించేవాడు. దీంతో నరసమ్మ పెద్దతుంబుళంలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా.. పెద్దకుమార్తె శాంతి ప్రసవం కోసం నరసమ్మ వద్దకు వచ్చింది.
శనివారం ఉదయం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకురాగా బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న రామయ్య ఆస్పత్రికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం భార్య దగ్గరకు వచ్చి తనతో కాపురానికి రావాలని గొడవపడ్డాడు. ఆమె ససేమిరా అనడంతో బయటకు వెళ్లి మద్యం తాగాడు. సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చి అందరూ చూస్తుండగానే కత్తితో భార్యను పొడిచాడు. దీంతో అక్కడి వారంతా భయంతో కేకలు వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులో తీసుకున్నారు. రక్తం మడుగులో పడిఉన్న నరసమ్మకు డాక్టర్ మల్లికార్జున వైద్య సేవలు ప్రారంభించగా.. అప్పటికే మృతి చెందింది.


