రైతు సమస్యలపై ఈ నెల ఆఖరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
బెళుగుప్ప : రైతు సమస్యలపై ఈ నెల ఆఖరులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేపడతామని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని తగ్గుపర్తి గ్రామంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం ఏమీ పట్టలేదన్నారు. హంద్రీనీవా మొదటి దశ ఆయకట్టుకు నీరందించి ఉంటే ఉరవకొండ నియోజకవర్గం సస్యశ్యామ లం అయి ఉండేదన్నారు.
ఈ యేడాది ఆగస్టు 30 నాటికే నియోజకవర్గంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ హామీని నిలుపులేకపోయిందని విమర్శించారు. వేరుశనగ పంటలు ఎండుతుంటే రక్షక తడులంటూ మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతులు ఇంత నష్టపోతున్నా ఇన్పుట్ సబ్సిడీని మిగిల్చామని గొప్పలు చెప్పుకునే విధంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వ్యవహరించడం తగదన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీనివాస్, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాకెట్ల అశోక్, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.