ప్రే‘ముంచాడు’!

ప్రే‘ముంచాడు’!


  ప్రేమించి మోసపోయిన యువతి

  ప్రియుడి ఇంటి వద్ద బంధువులతో కలసి ఆందోళన

  తనకేమీ తెలియదంటున్న ప్రియుడు


 

 పూసపాటిరేగ: వరసకు బావ అవుతాడు.. ప్రేమగా నాలుగు మాటలు చెబితే పరవశించిపోయింది. ప్రేమించానంటే.. నమ్మి వెంట నడిచింది. సర్వమూ అర్పించింది. ఇలా వీరి ప్రేమకథ ఐదేళ్లపాటు సాగింది. పెళ్లి మాట ఆమె ఎప్పుడు అడిగినా.. ఇదిగో అదిగో అంటూ కాసేపు, ఉద్యోగమొచ్చాక చేసుకుంటానని మరోసారి తప్పించుకువచ్చాడు. చివరికి ఉద్యోగం వచ్చిన తర్వాత అతను ముఖం చాటేయడంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి..

 

 బావ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. మరికొన్ని గంటల్లో అతను వేరే పెళ్లికి సిద్ధం కావడంతో చేసేదిలేక శనివారం పోలీసులను ఆశ్రయించింది. మండలంలోని రెల్లివలసలో జరిగిన ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశమైంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ జిల్లా భీమిలి మండలం చిట్టివలసకు చెందిన యువతి వాళ్లె నాగమణి, పూసపాటిరేగ మండలం రెల్లివలసకు చెందిన చందక రమణ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

 

  నాగమణికి రమణ వరసకు బావ అవుతాడు. ‘ఉద్యోగం రాగానే నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఆర్మీలో ఉద్యోగం కోసం రూ.లక్ష కట్టాలి. ఉంటే సర్దుబాటు చేయు..’ అని అతను కోరడంతో ఆ మొత్తాన్ని ఆమె సమకూర్చింది. ఈ ఐదేళ్ల కాలంలో వీరు శారీరకంగానూ ఒక్కటయ్యారు. అయితే, ఇప్పుడు ఆమెను కాదని రమణ వేరే సంబంధం కుదుర్చుకున్నాడు. వేరే యువతితో శనివారం అతనికి వివాహం జరగనుందని తెలియడంతో.. నాగమణి బంధువులతో కలసి రెల్లివలస చేరుకుంది. ప్రియుడి ఇంటి ముందు ఆందోళనకు దిగింది.

 

 దీంతో సుమారు రెండుగంటలపాటు అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంత జరిగినా ప్రియుడు రమణ మాత్రం బయటకు రాలేదు. దీంతో నాగమణి  పూసపాటిరేగ పోలీసులను ఆశ్రయించింది. ఇదే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న చందక రమణ విలేకరులతో మాట్లాడుతూ.. డబ్బుల కోసమే తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపాడు. శారీరకంగా కలవడం అవాస్తవమని, తాను ఎటువంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top