బాబు..రాయలసీమ ద్రోహి
రాయలసీమకు అన్యాయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీమ ద్రోహిగా మారారని వైస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు.
- రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి
- విలయతాండవం చేస్తున్న కరువు
- నంద్యాల ఉప ఎన్నికల్లో
వైఎస్ఆర్సీపీదే విజయం
- విజయవంతమైన ప్లీనరీ
నంద్యాల: రాయలసీమకు అన్యాయం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీమ ద్రోహిగా మారారని వైస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్ఆర్సీపీ నంద్యాల నియోజకవర్గం ప్లీనరీ.. స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతకాన్ని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవైరామయ్య, ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వేదికపైన మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్సీగంగుల ప్రభాకర్రెడ్డి, శ్రీశైలం, బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జిలు బుడ్డా శేషారెడ్డి, కాటసాని రామిరెడ్డి.. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇటీవల హత్యకు గురైన చెరుకులపాడు నారాయణరెడ్డి చిత్రపటానికి కూడా వీరు పూలమాలలు వేశారు. అనంతరం పార్టీ నేత ద్వారం మాధవరెడ్డి అధ్యక్షతన ప్లీనరీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోందన్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పాలన కొనసాగుతోందన్నారు. వైఎస్ఆర్ హయాంలో శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగులు నీరు ఉండేదని, అప్పట్లో రాయలసీమ కూడా కోన సీమ లాగా ఉండేదని గుర్తు చేశారు. నంద్యాల ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
హామీలను విస్మరించారు..
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చంద్రబాబు విస్మరించారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవైరామయ్య అన్నారు. గతంలో నంద్యాల ప్రజలు వైఎస్ఆర్సీపీని గెలిపించారని, ఈ స్థానంతో తాము తప్పక గెలిచి తీరుతామన్నారు రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను దగా చేసిన ఘనత చంధ్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తోందని శ్రీశైలం నియోజకవర్గ ఇన్చార్జి బుడ్డా శేషారెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు, భూ దందాలు పెరిగిపోయయని, కుమారుడు లోకేష్ను దొడ్డిదారిన మంత్రిని చేశారని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని, హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు.
ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం...
సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయలేనని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరచూ చెప్పేవారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం..హామీలను విస్మరించి..ప్రజలను దగా చేస్తూ పాలన కొనసాగిస్తున్నారని నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జి మలికిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బాబు అబద్ధాలను, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిజాయితీని ప్రజలు గుర్తించారన్నారు. నంద్యాల ఉపఎన్నికన కార్యకర్తలు ప్రతిష్టాత్మంగా తీసుకొని..భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించాలన్నారు.