ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
అద్దంకి : పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు యువకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటన పట్టణంలోని నాగులపాడు రోడ్డులోని ఎక్సైజ్ పోలీస్స్టేషన్సమీపంలో శనివారం జరిగింది.
అద్దంకి : పాత కక్షల నేపథ్యంలో ముగ్గురు యువకులపై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటన పట్టణంలోని నాగులపాడు రోడ్డులోని ఎక్సైజ్ పోలీస్స్టేషన్సమీపంలో శనివారం జరిగింది. క్షతగాత్రుల కథనం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులు కారులో శనివారం అద్దంకి వచ్చారు.
పట్టణంలోని శ్రీనగర్కు చెందిన బాజీని కారులో ఎక్కించుకుని నాగులపాడు రోడ్డు ఎక్సైజ్ పోలీస్స్టేషన్ సమీపంలోని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. అక్కడ బాజీని కిందకు దించి కొడుతున్నారు. వారి నుంచి తప్పించుకుని పక్కకు వచ్చిన బాజీ వెంటనే తన స్నేహితులైన పర్శు స్వరూప్, మహేంద్రలకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వారిద్దరూ బైకులపై అక్కడికి చేరుకున్నారు. హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులు వీరిపై కూడా కత్తులతో దాడి చేయడం ప్రారంభించారు.
ఇంతలో స్థానికులు రావడాన్ని గమనించి నిందితులు అదే కారులో పలాయనం చిత్తగించారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన స్వరూప్ను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తీసుకెళ్లారు. బాజీ అనే యువకుడికి స్థానికంగా ఉండే నరేశ్, గౌతమ్, దేవరకొండ హరీశ్తో పాత గొడవలున్నట్లు సమాచారం. వారే హైదరాబాద్ నుంచి నాలుగురిని పిలిపించి దాడి చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.