సింగాలగుంట నగరపాలక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ప్రొజెక్టర్, స్క్రీన్
ప్రభుత్వ పాఠశాలలంటే ప్రతి ఒక్కరికీ లోకువే. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులన్నా వసతులుండవని తల్లిదండ్రుల భావన. అన్నీ ఉచితమైనప్పటికీ కార్పొరేట్ హంగుల మాయలో పడి ఫీజులకు వెనుకాడక తమ పిల్లలను ప్రై వేట్ స్కూల్లో చేర్పించడం పరిపాటిగా మారింది.
– ప్రభుత్వ బడుల్లో ఏసీ డిజిటల్ తరగతులు
– తిరుపతిలో నాలుగు పాఠశాలల ఎంపిక
– శరవేగంగా పనులు
తిరుపతి ఎడ్యుకేషన్:
ప్రభుత్వ పాఠశాలలంటే ప్రతి ఒక్కరికీ లోకువే. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులన్నా వసతులుండవని తల్లిదండ్రుల భావన. అన్నీ ఉచితమైనప్పటికీ కార్పొరేట్ హంగుల మాయలో పడి ఫీజులకు వెనుకాడక తమ పిల్లలను ప్రై వేట్ స్కూల్లో చేర్పించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్కు దీటుగా డిజిటల్ తరగతులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
తిరుపతి నగరంలో 30నగరపాలక ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో సింగాలగుంట, ఎస్టీవీ నగర్, చెన్నారెడ్డికాలనీ, ఉప్పొంగి హరిజనవాడల్లోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలను మొదటి విడతలో డిజిటల్ తరగతులకు ఎంపికయ్యాయి. ఒక్కో పాఠశాలలో రూ.45లక్షలతో ఆధునీకరణ పనులు చేపట్టారు. డిజిటల్ తరగతులను సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేపట్టడంతో సింగాలగుంట నగరపాలక ప్రాథమిక పాఠశాలలో శరవేగంగా పనులు చేపట్టారు.
పాక నుంచి కార్పొరేట్ స్థాయికి..
2007కు ముందు సింగాలగుంట నగరపాలక ప్రాథమిక పాఠశాల కేవలం ఏడుగురు విద్యార్థులతో పూరిపాకలో నడిచింది. కొత్తగా భవనం నిర్మించి, అందులోకి పాఠశాలను మార్చారు. అక్కడ పనిచేస్తున్న హెడ్మాస్టర్ దొరస్వామయ్య సొంత నిధులతో పాటు ఇతర ఉపాధ్యాయులు, దాతల సహకారంతో కార్పొరేట్కు తగ్గట్టు తీర్చిదిద్దారు. క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య 7నుంచి 135కి చేరింది. ప్రస్తుతం డిజిటల్ తరగతికి ఎంపికవ్వడంతో ప్రభుత్వమే రూ.45లక్షలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. ప్రతి తరగతిలో ఆకట్టుకునేలా బొమ్మలు, పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలు, ప్రొజెక్టర్, ఏసీని ఏర్పాటు చేస్తోంది. కొత్తగా పై అంతస్థులో అదనపు తరగతి గదుల భవనాన్ని నిర్మిస్తోంది. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.