కలెక్టర్ సాయం చేసినా.. ప్రాణాలు నిలువలేదు! | A man killed in road accident | Sakshi
Sakshi News home page

కలెక్టర్ సాయం చేసినా.. ప్రాణాలు నిలువలేదు!

Feb 10 2016 8:41 PM | Updated on Mar 21 2019 8:30 PM

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక యువకుడిని సమయానికి ఎవరూ ఆదుకోలేదు.

రామాయంపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒక యువకుడిని సమయానికి ఎవరూ ఆదుకోలేదు. అటుగా వచ్చిన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా క్షతగాత్రుడిని తన కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మార్గం మధ్యలోనే ఆ యువకుడు ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని మెడ్లీ ఫార్మసీలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రామకృష్ణ భరద్వాజ్, గంగల్ల నరేశ్‌కుమార్ లు బైక్‌పై కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. రామాయంపేట పట్టణ శివారులో వీరు వెళ్తున్న బైక్ ముందు వెళ్తున్న ఆటో వెనుక భాగాన్ని తాకి అదుపుత్పి పడిపోయింది.

బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. వీరిలో రామకృష్ణ భరద్వాజ్ (30)కు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో 108 రాకపోవడంతో నరేశ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా నిలబడి చాలా మందిని సాయం కోరాడు. కానీ, ఎవరూ స్పందించడం లేదు. ఆ సమయంలో అదే దారిలో కారులో హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగితారాణా తన కారులో క్షతగాత్రుడిని ఎక్కించుకుని నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement