
డ్రైవింగ్ లెసైన్సుల్లో 30 శాతం బోగస్
దేశంలో 30 శాతం బోగస్ డ్రైవింగ్ లెసైన్స్లు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
♦ వాటిని ఏరిపారేయాల్సిందే
♦ కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
సాక్షి, విశాఖపట్నం : దేశంలో 30 శాతం బోగస్ డ్రైవింగ్ లెసైన్స్లు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై రెండు రోజుల జాతీయ వర్క్షాప్ శుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమైంది. 18 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, దాదాపు వంద మంది దేశవిదేశీ అధికారులు ఈ వర్క్షాప్లో పాల్గొంటున్నారు. రహదారుల భద్రతపై వారు 69 రకాల సిఫార్సులను అందించారు.ఈ సదస్సులో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడారు.
రవాణా శాఖలో అవినీతికి మూల్యంగా ప్రాణాలను చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని చెప్పారు. ఈ సంఖ్యను బ్రెజీలియా డిక్లరేషన్ ప్రకారం 2020 నాటికి 50 శాతానికి తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... రోడ్డు భద్రతకు సంబంధించి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజినీరింగ్, ఎమర్జెన్సీ, ఎన్విరాన్మెంట్ అనే అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.
ప్రమాదాలను 50 శాతం తగ్గిస్తాం
రాష్ర్టంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2025 కల్లా 50 శాతానికి తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన శుక్రవారం విశాఖలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ర్టంలో రోడ్లు, పోర్టుల అభివృద్ధిపై చర్చించారు.నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్టు అండ్ రోడ్ సేఫ్టీ సంస్థను విశాఖలో ఏర్పాటు చేయాలని సీఎం కోరారు.