బావిలో దూకి యువతి ఆత్మహత్య 

Young woman committed suicide - Sakshi

రామడుగు(చొప్పదండి) : ఓ పక్క వివాహం కావడం లేదనే బెంగ, మరోపక్క కుటుంబాన్ని వేధిస్తోన్న భూ వివాదం.. వెరసి ఓ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాయి. ఈ ఘటన రామడుగు మండలం గోపాల్‌రావుపేటలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన రాసబత్తుల సుమలత(25) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై వి. రవి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాసబత్తుల మణి– రాజేందర్‌లకు ముగ్గురు కూతుళ్లు.

చిన్నకూతురు సుమలత ఇటీవలే బీఈడీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు రాసింది. కాగా.. గ్రామానికి చెందిన ఎడవెల్లి నరేందర్‌రెడ్డికి రాజేందర్‌కు కొన్ని మాసాలుగా భూ వివాదం సాగుతోంది. భూమి అమ్మి కూతురు వివాహం చేద్దామంటే అది కోర్టులో ఉండిపోయింది. దీంతో సుమలత వివాహం కావడం లేదని, ఇక కాదేమోనని కొద్దిరోజులుగా మనోవేదనకు గురవుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది.

అందులో నీరు లేకపోవడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని బయటకు తీసి పంచనామాకు కరీంనగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి రాజేందర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఎడవెల్లి నరేందర్‌రెడ్డి ఇంటి ఎదుట శవాన్ని ఉంచి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. ఎస్సై రవి అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top