యువకుడి దారుణహత్య

Young Man Murder In Ananthapuram - Sakshi

సాక్షి, అనంతపురం సెంట్రల్‌ : నగరంలోని నారాయణరెడ్డి కాలనీకి చెందిన శ్రీరాములు(35) సోమవారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. తాగుడు అలవాటున్న శ్రీరాములు రోజూ పొద్దుపోయేంత వరకు ఇంటికి వెళ్లేవాడు కాదు. సోమవారం కూడా పూటుగా మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో గుత్తిరోడ్డులోని ఓ ప్రైవేటు స్కూల్‌ సమీపాన గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. తలపై బండరాయి వేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆ సమయంలో జన సంచారం తక్కువగా ఉండటంతో ఆలస్యంగా గుర్తించారు.

 
భూ వివాదమే కారణమా..? 
గుంతకల్లు పట్టణానికి చెందిన సుధాకర్‌రెడ్డి, హేమకోటరెడ్డి దాయాదుల మధ్య 30 ఎకరాల భూ వివాదం నడుస్తోంది. సదరు భూమిని సుధాకర్‌రెడ్డి.. శ్రీరాములు పేరుతో జీపీఏ చేయించాడు. అనంతరం తాడిపత్రికి చెందిన మరో వ్యక్తికి అమ్మాడు. హేమకోటిరెడ్డి కూడా అదే భూమిని మరో వ్యక్తికి విక్రయించాడు. ప్రస్తుతం భూ సమస్య గుంతకల్లు కోర్టులో నడుస్తోంది. శ్రీరాములు సోమవారం కూడా అక్కడి కోర్టుకు హాజరై వచ్చాడు. దాదాపు రూ.కోట్లలో ఈ భూమి విలువ జేస్తుండడంతో శ్రీరాములును తప్పించేందుకే హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top