జబాగుడలో పిడుగుపడి యువకుడి మృతి

Young man Died by Thunderbolt  - Sakshi

జయపురం : నవరంగ్‌పూర్‌ జిల్లా డాబుగాం సమితిలోని  జబాగుడ గ్రామంలో పిడుగు పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆ గ్రామ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది. ఇంటికి పెద్ద కొడుకు అకస్మాత్తుగా పిడుగు పడి కళ్ల ముందే మరణించడంతో తల్లి దండ్రులు భోరున విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి.  గ్రామానికి చెందిన మోహన హరిజన్‌ పెద్ద కుమారుడు కృష్ణ హరిజన్‌(22) ఉదయం లేచి ఇంటి ముందు వరండాలో పళ్లు తోముకుంటున్నాడు.

ఆ సమయంంలో అకస్మాత్తుగా పెనుగాలులు వీస్తూ పిడుగులు పడ్డాయి. ఒక పిడుగు కృష్ణ హరిజన్‌పై పడడంతో అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. ఇంటిలో ఉన్న వారు ఆ దృశ్యాన్ని చూసి విలçపిస్తూ  వెంటనే డాబుగాం హాస్పిటల్‌కు ఫోన్‌ చేసి 108 అంబులెన్స్‌లో   హాస్పిటల్‌కు తరలించారు. కృష్ణ హరిజన్‌ను పరీక్షించిన వైద్యుడు అప్పటికే చనిపోయాడని ప్రకటించారు. ఈ విషయం  డాబుగాం పోలీసులకు తెలియడంతో    సబ్‌ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ స్వరాజ్, ఏఎస్సై రేణు ప్రధాన్‌లు సిబ్బందితో ఆ గ్రామానికి చేరుకున్నారు.

సంఘటనపై దర్యాప్తు జరిపి కేసు నమోదు చేశారు. కృష్ణ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.  చేతికంది వచ్చిన పెద్ద కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో తండ్రి మోహన హరిజన్‌  కుమారుడి మృతదేహంపై పడి రోదించడం చూపరుల  హృదయాలను కలిచివేసింది.  
   
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top