జీతం కోసం వస్తే.. బ్రోతల్ హౌస్కు
ముంబై : జీతం డబ్బులడగడానికి వచ్చిన మాజీ మహిళా ఉద్యోగిపై యజమాని మద్యం మత్తులో అత్యాచారం చేయడంతో పాటు ఆమెకు డ్రగ్స్ ఇచ్చి వేశ్యా వాటికలో వదిలేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటన ముంబైలో సెప్టెంబర్ 2న అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలోని గోరేగావ్ ప్రాంతానికి చెందిన నిందితుడు (27) క్యాటరింగ్ వ్యాపారం చేస్తుంటాడు. బాధితురాలు గతంలో అతని దగ్గర పని చేసి ఆ తర్వాత మానేసింది. కానీ జీతం డబ్బులు కొంత రావలసి ఉండడంతో అవి ఇవ్వాలని బాధితురాలు నిందితుడిని అడిగింది. నిందితుడు డబ్బిస్తానంటూ సెప్టెంబరు 2న అంధేరి మెట్రో స్టేషన్కు రమ్మన్నాడు. ఆ తర్వాత యువతిని బీచ్కు తీసుకెళ్లగా, ఇద్దరూ కలిసి అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు.
యువతి మత్తులోకి జారుకున్న తర్వాత నిందితుడు ఆమెను వేశ్యలకు నిలయమైన కామాటిపురా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక రూం బుక్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం డ్రగ్స్ ఇచ్చి యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. తెల్లారేసరికి తేరుకున్న యువతి జరిగిన ఘోరాన్ని గుర్తించి నాగ్పడా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. అనంతరం యువతికి ముంబైలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో పోలీసులు ఆమెను సంరక్షణా గృహానికి తరలించారు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు సెప్టెంబర్ 5న అతని ఇంట్లోనే అరెస్ట్ చేశారు. మరోవైపు కామాటిపురాలో రూం అద్దెకిచ్చిన 45 ఏళ్ల మహిళను కూడా పోలీసులు తమ అదుపులో తీసుకున్నారు.