మరొకరితో సన్నిహితంగా మెలుగుతోందని..

Woman Was Brutally Murdered In Kodada - Sakshi

సాక్షి, నల్గొండ  : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన కోదాడ మండల పరిధిలోని గణపవరం శివారులో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ దశరథ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొయలగూడేనికి చెందిన రమాదేవి(28)కి అదే జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఏసుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కుమార్తె సంతానం. దంపతుల మధ్య నెలకొన్న వివాదాల కారణంగా రమాదేవి ఏడాదిన్నర క్రితం భర్త నుంచి విడిపోయింది. అప్పటినుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం మందులగూడెంలో నివాసముంటున్న తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. బతుకుదెరువు నిమిత్తం రమాదేవి ఏడాదిన్నర క్రితమే డబ్బా శ్రీను అనే సర్కస్‌ కపెనీలో పనిచేస్తోంది. అయితే అదే కంపెనీలో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన సిండే సవాల్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

పది రోజుల క్రితం..
ఊరూరా తిరుగుతూ సర్కస్‌ నిర్వహించే బృందంతో కలిసి సిండే సవాల్, రమాదేవి కూడా ఇటీవల మండల పరిధిలోని గణపవరం గ్రామానికి వచ్చా రు. బృందం సభ్యులు గ్రామ శివారులో డేరాలు ఏర్పాటు చేసుకుని సర్కస్‌ నిర్వహిస్తూ అక్కడే జీవనం సాగిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా రమాదేవి మరొకరితో సఖ్యతగా మెలుగుతోందని, అతడితోనే ఫోన్లో ఎక్కువ మాట్లాడుతోందని సిండే సవాల్‌ అనుమానించారు. ఈ నేపథ్యంలోనే పది రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరగడం తో రమాదేవి మందులగూడేనికి వెళ్లిపోయింది. 

కూలి డబ్బులు తీసుకునేందుకు..
సర్కస్‌లో పని చేసినందుకు గాను కూలి డబ్బులు తీసుకున్న సిండే సవాల్‌ స్వగ్రామం వెళ్లిపోతున్నానని సర్కస్‌ బృందానికి చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అయితే ఆ బృందం మేస్త్రీ రమాదేవికి కూడా ఫోన్‌ చేసి సిండే సవాల్‌ వెళ్లిపోయాడని, నీకు రావాల్సిన కూలి డబ్బులు తీసుకుపోవాలని రమాదేవికి ఫోన్‌ చేశాడు. దీంతో రమాదేవి బుధవారం సోదరుడు హరిని వెంటబెట్టుకుని గణపవరం గ్రామానికి వచ్చింది. కూలి డబ్బులు సోదరుడికి ఇవ్వడంతో వెళ్లిపోగా తాను మాత్రం సర్కస్‌ బృందం సభ్యులతో డేరాలోనే ఉంది. 

అర్ధరాత్రి వచ్చి..
అయితే తాను స్వగ్రామం వెళ్లిపోయాయని తెలిస్తే రమాదేవి కూలి డబ్బులకు కచ్చితంగా రమాదేవి వస్తుందని భావించిన సిండే సవాల్‌ బుధవారం అర్ధరాత్రి గణపవరం శివారులోని సర్కస్‌ బృందం వేసుకున్న డేరాల వద్దకు వచ్చాడు. అతడు ఉహించినట్టుగానే రమాదేవి అక్కడే ఉండడంతో ఇకపై కలిసే మంచిగా ఉందామని మాయమాటలు చెప్పాడు. అక్కడి నుంచి అలా పక్కకి వెళ్లి మాట్లాడుకుందామని తీసుకుపోయాడు. కాసేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా గొడవకు దారి తీయడంతో ఆగ్రహానికి లోనైన సిండే సవాల్‌ పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో ఆమో ఛాతిభాగంలో పొడిచి పారిపోయాడు. దీంతో రమాదేవి కేకలు వేస్తూ నేలకొరగడంతో సర్కస్‌ బృందం సభ్యులు వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రమాదేవి సోదరుడు హరి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top