హత్యచేసి బావిలో పడేశారు | Sakshi
Sakshi News home page

హత్యచేసి బావిలో పడేశారు

Published Sat, Sep 14 2019 11:24 AM

Woman Killed And Thrown Into The Well At Chinna Shankarampeta - Sakshi

సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్‌): అనుమానస్పద మృతిగా బావించిన మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన శ్రీలతను హత్యచేసి బావిలో పడేసినట్లు నిర్దారణకు వచ్చినట్లు తూప్రాన్‌  డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లిలో మృతురాలి శవం లభించిన బావి వద్ద ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలత బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. శ్రీలత కనిపించకుండాపోయి బావిలో శవమై తేలడంతో ఆగ్రహించిన శ్రీలత బంధువులు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ముందు నుంచి శ్రీలతను హత్యచేసి బావిలో పడేశారని పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

 మల్లుపల్లిలో విచారణ చేపడుతున్న డీఎస్పీ కిరణ్‌కుమార్‌ 

ఈ విషయంపై గ్రామంలో విచారణ జరిపిన డీఎస్పీ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల నమోదు కోసం వ్యవసాయ బావి వద్ద పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీలత అనుమానస్పద మృతిపై విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీలతను హత్యచేసి బావిలో పడేసినట్లు నిర్దారణకు వచ్చినట్లు తెలిపారు. నిందితులు ఎవరనేది తమ విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు. శ్రీలత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్‌ ఉన్నారు.  

Advertisement
Advertisement