వివాహమైన ఆరు నెలలకే.. | Woman Committed Suicide Just Six Months After Her Marriage | Sakshi
Sakshi News home page

వరకట్న వేధింపులకు నవ వధువు బలి

Feb 25 2020 8:31 AM | Updated on Feb 25 2020 8:32 AM

Woman Committed Suicide Just Six Months After Her Marriage - Sakshi

భర్త గౌతమ్‌తో దేవీ ప్రియ (ఫైల్‌)

గాజువాక: వరకట్న రక్కసికి ఒక యువతి బలైపోయింది. ప్రేమించి పెళ్లాడిన భర్త వేధింపులు తాళలేక ఊపిరి తీసుకుంది. వివాహమైన ఆరు నెలలకే ఆమె బలవన్మరణానికి పాల్పడటం సంచలనమైంది. పెదగంట్యాడ నిర్వాసిత కాలనీ శీకువానిపాలెంలో ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. న్యూపోర్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శీకువానిపాలెం ప్రాంతానికి చెందిన గౌతమ్‌ కుమార్‌ యలమంచిలి ప్రాంతానికి చెందిన దేవీ ప్రియ (24)ను ప్రేమించి ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. గౌతమ్‌ కుమార్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుండగా దేవీ ప్రియ బ్యూటీషీయన్‌గా పని చేస్తోంది. గౌతమ్‌ కుమార్‌ తనకు కట్నం కావాలంటూ వివాహమైనప్పటి నుంచీ దేవీప్రియను వేధిస్తున్నాడు. దీంతో ఆమె పుట్టింటి వారు ఇటీవల లక్ష రూపాయలు ఇచ్చారు.

ఆ డబ్బులు సరిపోవని, ఇంకా కావాలంటూ ఆమెను వేధిస్తుండటం, తాగి వచ్చి సూటిపోటి మాటలతో బాధిస్తుండటంతో వారి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఎప్పటి మాదిరిగానే ఆదివారం రాత్రి కూడా వారి మధ్య ఘర్షణ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెందిన దేవీప్రియ ఇంట్లోని ఫ్యాన్‌ హుక్‌కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న న్యూపోర్టు సీఐ కె.పైడపునాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక సమాచారం సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మృతురాలి సోదరుడు గోవింద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement