పెళ్లైన మూడు నెలలకే.. భర్తని హత్య ? | Wife Killed Husband in West Godavari | Sakshi
Sakshi News home page

పెళ్లైన మూడు నెలలకే..

Jan 9 2019 7:21 AM | Updated on Jan 9 2019 7:21 AM

Wife Killed Husband in West Godavari - Sakshi

గెడ్డం రాజు మృతదేహం

పశ్చిమగోదావరి, తణుకు టౌన్‌: పెళ్లై మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే భర్త హత్యకు గురయ్యాడు. అతని భార్యే ఈ హత్య చేసిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన గెడ్డం రాజు(25)కు అత్తిలి మండలం మంచిలి గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మితో ఇటీవల వివాహమైంది. సోమవారం రాత్రి రాజు తల్లి లక్ష్మి ఆసుపత్రి çపనిపై వేరే గ్రామం వెళ్లింది. రాజు అతని భార్య సుబ్బలక్ష్మి గదిలో నిద్రించారు. రాజు తండ్రి ఆంజనేయులు గది బయట వరండాలో పడుకున్నాడు. మంగళవారం తెల్లవారు జామున తన భర్త రాజు లేవలేని స్థితిలో ఉన్నాడని రాజు తండ్రి ఆంజనేయులకు సుబ్బలక్ష్మి చెప్పింది. అతను వెళ్లి కుమారుని నిద్రలేపే ప్రయత్నం చేశాడు.

ఎంతకీ లేవకపోవడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా చనిపోయాడని నిర్ధారించుకున్నారు. అయితే స్థానికులు హత్యగా భావించడంతో రాజు తండ్రి ఇరగవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సుబ్బలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు  పెనుగొండ సీఐ విజయకుమార్‌ తెలిపారు. సంఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ టి.ప్రభాకరబాబు సందర్శించారు. ఎస్సై బి.రవికుమార్, సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు..
సుబ్బలక్ష్మిని గెడ్డం రాజు తన బంధువుల పెళ్లిలో చూసి ఇష్ట పడినట్టు స్థానికులు చెప్పారు. రాజు ఇష్ట ప్రకారమే పెద్దలు పెళ్లి చేసినట్టు తెలిపారు. వ్యవసాయ కూలి పనులు చేసుకునే రాజుకు మద్యం అలవాటు ఉందని, మద్యం మత్తులో ఉండగా చంపేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఈ హత్య రాజు భార్య ఒక్కతే చేసిందా? లేక మరి కొందరు ఆమెకు సహకరించారా? అనే అనుమానాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. రాజు నిద్రించే గదికి ఒక వైపు కిటికీకి ఫ్రేమ్‌ లేదని, అందువల్ల వరండాలో పడుకున్న రాజు తండ్రి ఆంజనేయులు కంట పడకుండా కిటికీ ద్వారా లోనికి ప్రవేశించి ఈ హత్యకు పాల్పడి ఉంటారన్న కొందరు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement