సుపారీ ఇచ్చి.. భర్త ప్రాణం తీసిన భార్య.. | Twist in Newly Married Couple Attack In Vizianagaram | Sakshi
Sakshi News home page

సుపారీ ఇచ్చి.. భర్త ప్రాణం తీసిన భార్య..

May 8 2018 7:20 AM | Updated on Jul 30 2018 8:41 PM

Twist in Newly Married Couple Attack In Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం : పార్వతీపురం హత్య కేసులో సంచలనం నిజం వెల్లడైంది. ఇష్టంలేని పెళ్లితో రగిలిపోయిన భార్య సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది.

సోమవారం ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. కొద్దిగా చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్‌రావు తలపై మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్‌రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు.

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. హత్య జరిగిన స్థలాన్ని, సరస్వతిని కలిసి విచారించిన ఎస్పీకి ఎక్కడో అనుమానం వచ్చింది. పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది.

గణపతినగరం స్టేషన్‌కు తరలించి కూపీ లాగగా వారు అసలు విషయాన్ని వెల్లడించారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్‌రావును భార్య హత్య చేయించిందని తెలిసి ఎస్సీ షాక్‌ అయ్యారు. స్నేహితుడు శివ సలహా తీసుకున్న సరస్వతి... భర్తను చంపేందుకు వైజాగ్‌కు చెందిన రౌడీషీటర్‌ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ITDA పార్క్‌ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కోలుకున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ప్రాథమిక కథనం.. నవ జంటపై దాడి.. భర్త మృతి

Advertisement
 
Advertisement
Advertisement