క్షణాల్లోనే ప్రాణాలు పోయాయి | three men dead in septic tank | Sakshi
Sakshi News home page

క్షణాల్లోనే ప్రాణాలు పోయాయి

Jan 8 2018 8:25 AM | Updated on Aug 18 2018 8:37 PM

three men dead in septic tank - Sakshi

మృతి చెందిన కార్మికులు మాదేగౌడ, శ్రీనివాస్, నారాయణస్వామి

బొమ్మనహళ్లి : మురికి నీటి ట్యాంక్‌ శుభ్రం చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరి అందక మృతి చెందిన సంఘటన బొమ్మనహళ్లి హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్‌ సామసంద్ర పాళ్యలో ఉన్న ఎన్‌.డి. సెఫల్‌ అపార్టుమెంటులో ఆదివారం చో టు చేసుకుంది. మృతులు తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నాగసంద్ర గ్రా మానికి చెందిన మాదేగౌడ (45), కోలా రు జిల్లా శ్రీనివాసపుర తాలూకా యగువపాపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణ స్వామి (38), సామసంద్రపాళ్యకు చెందిన పేయింటర్‌ శ్రీనివాస్‌ (52)గా గుర్తించారు.  వీరు ఇక్కడి సామసంద్రపాళ్యలో నివాసం ఉంటున్నారు. అసలు విషయానికి వస్తే వీరికి మురికి ట్యాంకులు శుభ్రం చేయడం తెలియదు. మాదేగౌడ గార్మెంట్స్‌లో ఉద్యోగి కాగా, నారాయణ స్వామి ఎలక్ట్రీషియన్, శ్రీనివాస్‌ పెయింటర్‌. ఆదివారం సెలవు కావడంతో ఇక్కడి ఎన్‌డీ సెఫల్‌ అపార్టుమెంట్‌లో మురికినీటి ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఉదయం ముగ్గురు మురికి నీటి ట్యాంకులోకి దిగారు.

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వీరికి అనుభవం లేకపోవడంతో వీరు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో అపార్టుమెంట్‌ నిర్వాహకులు విషయం గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమా చారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని సెయింట్‌జాన్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి, కార్పొరేటర్లు గురుమూర్తి, శోభా స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఇదే సమయంలో మంత్రి జార్జ్‌తో పాటు మేయర్‌ సంపత్‌ రాజ్‌ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు మేయర్‌ ప్రకటించారు. పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ కూడా ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే మార్చురీ వద్ద సామసంద్రపాళ్య గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. బాధ్యులు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement